న్యూస్రీల్
ఇళ్ల మధ్యే మురుగు
శనివారం శ్రీ 1 శ్రీ ఆగస్టు శ్రీ 2026
సీజనల్..
వికారాబాద్: సీజనల్ వ్యాధులు భయపెడుతున్నాయి. జలుబు, జ్వరం, కీళ్ల నొప్పులతో ప్రజలు మంచాన పడుతున్నారు. అంటువ్యాధులతో ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. వాంతులు, విరోచనాలతో చేరుతున్న వారి సంఖ్యలో క్రమంగా పెరుగుతోంది. పరిగి ప్రభుత్వ ఆస్పత్రిలో వందకుపైగా ఓపీ నమోదు అవుతోంది. ఇందులో 50కి పైగా సీజనల్ వ్యాధుల బారిన పడిన వారే ఉన్నారు. పది మందికి పైగా వాంతులు, విరేచనాలతో చేరుతున్నారు. వికారాబాద్ జనరల్ ఆస్పత్రిలో 400 పైగా ఓపీ నమోదు అవుతోంది. వందకు పైగా సీజనల్ వ్యాధులతో చేరుతున్నారు. ఓపీలో 50 వరకు వాంతులు విరేచనాలతో వస్తున్న వారు ఉంటున్నారు. పది మందికి పైగా అడ్మిట్ అవుతున్నారు. ఇంతకు రెండు మూడు రెట్లు ప్రైవేటు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. చికన్గున్య, మలేరియా, టైఫాయిడ్ తదితర రోగాల బారిన పడుతున్నారు. ఇటీవల వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఫీవర్ సర్వే నిర్వహించగా వందల సంఖ్యలో రోగులు మంచం పట్టినట్టు తేలింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 2,77,452 ఇళ్లకు వెళ్లి 4,82,798 మందికి చెందిన శాంపిల్స్ సేకరించి టెస్టులు నిర్వహించారు. ఇందులో 1,980 జ్వర పీడితులు ఉన్నారు. డెంగీ కేసులు మూడు నమోదయ్యాయి. గురువారం రాత్రి వాంతులు విరేచనాలతో ఓ మహిళ మృతి చెందింది. నవాబుపేట మండలం అక్నాపూర్ గ్రామానికి చెందిన లింగంపల్లి కాంతమ్మ వికారాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
పడకేసిన పారిశుద్ధ్యం
గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్యం లోపించడంతో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. గ్రామాల్లో పరిస్థితి కాస్త మెరుగ్గా ఉండగా.. పట్టణాల్లో పారిశుద్ధ్య సమస్యలు రోజురోజుకూ అధికమవుతున్నాయి. ప్రస్తుతం వరుసగా వర్షాలు కురుస్తుండటంతో సమస్య మరింత తీవ్రరూపం దాల్చింది. మున్సిపాలిటీల్లో చెత్త సక్రమంగా సేకరించడం లేదు. పట్టణ శివారు ప్రాంతాల్లో ఇష్టారాజ్యంగా డంప్ చేస్తున్నారు. దీంతో పరిసర ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దుర్గంధంతోపాటు దోమలు, ఈగలు పెరిగి ఆస్పత్రుల పాలవుతున్నారు. గతంలో పట్టణ ప్రగతి పేరుతో హడావిడి చేసిన మున్సిపల్ అధికారులు సీజనల్ వ్యాధుల సమయంలో వీధుల్లో కనిపించడం లేదనే విమర్శలు ఉన్నాయి. పెద్దేముల్ మండలం మంబాపూర్ బీసీ గురుకుల పాఠశాల గేటు ముందు మురుగు పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతోంది. విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. పలు సార్లు తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదు.
ఆస్పత్రులకు
క్యూ కడుతున్న జనం
నిత్యం పదుల సంఖ్యలో చేరుతున్న రోగులు
జిల్లాలో నమోదైన ఫీవర్ కేసులు 1,980
డెంగీ కేసులు 3
వాంతులు విరేచనాలతో మహిళ మృతి
రోజురోజుకూ పెరుగుతున్న పారిశుద్ధ్య సమస్య
జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు ఉండగా వాటి పరిధిలోని చాలా కాలనీల్లో చెత్తాచెదారం పేరుకుపోయింది. ఇళ్ల మధ్య మురుగు చెత్తాచెదారం, మురుగు పేరుకుపోవడంతో పందులు సంచరిస్తున్నాయి. అధికరులు పట్టించుకోవడం లేదని ఆయా కాలనీల ప్రజలు ఆరోపిస్తున్నారు. మున్సిపాలిటీ అభివృద్ధికి ఏటా రూ.కోట్లు ఖర్చు చేస్తున్నా ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ పట్టణాల్లో చెత్త సేకరణ అస్తవ్యస్తంగా తయారైంది.


