పరిగి: ప్రజాప్రభుత్వం అభివృద్ధి, రైతు సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించిందని పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దోమ మండలం గూడూరు, దొంగఎన్కేపల్లి, కుల్కచర్ల మండలంలోని అల్లాపూర్ గ్రామాల పరిధిలో రేడియల్ రోడ్డులో భూములు కోల్పోతున్న బాధిత రైతులకు చెక్కులు పంపిణీ చేశారు. 66 ఎకరాల భూమికి రూ.16.227 కోట్ల పరిహారం చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వానికి సహకరిస్తున్న రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సర్కార్ రైతుల త్యాగాన్ని గౌరవిస్తూ పారదర్శకంగా మార్కెట్ విలువ ప్రకారం నష్టపరిహారం అందజేస్తోందన్నారు. రైతులు ప్రభుత్వంపై విశ్వాసం ఉంచి అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించడం అభినందనీయమన్నారు. పరిగి ప్రాంతప్రజలకు ఉద్యోగం, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వాసుచంద్ర, పీఏసీఎస్ చైర్మన్ పార్థసారథిపంతులు, కాంగ్రెస్ దోమ మండల అధ్యక్షుడు శాంత్కుమార్ తదితరులు పాల్గొన్నారు.


