అసౌకర్యంగా మారిన రోడ్లు
తాండూరు టౌన్: చిరుజల్లులకే రోడ్లన్నీ బురదమయంగా మారాయని 8వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ జావీద్ అసహనం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన.. పట్టణ శివారు ఇందిరమ్మ, రాజీవ్కాలనీల రోడ్లను పరిశీలించి మాట్లాడారు. కాలనీల రోడ్లు అధ్వానంగా ఉన్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీఅధికారం చేపట్టి రెండున్నరేళ్లు అయినా వార్డుల్లో పూర్తి స్థాయిలో సీసీరోడ్లు, మురుగు కాల్వలు లేకపోవడం దురదృష్టకరమన్నారు. ఎమ్మెల్యే మనోహర్రెడ్డి స్పందించి, అభివృద్ధి పనులు చేపట్టాలని కోరారు. లేని పక్షంలోఆందోళనలు తప్పవన్నారు.
అధైర్యం వద్దు..
వచ్చేది మనమే
తాండూరు: అధైర్య పడకండి.. మరో రెండేళ్లలో అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి అన్నారు. బుధవారం మున్సిపల్ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ పట్లోళ్ల దీపనర్సింహులు ఆధ్వర్యంలో పార్టీ కౌన్సిలర్లు, నాయకులు నగరంలో రోహిత్ను మర్యాదపూర్వకంగా కలిశారు. తాండూరు రాజకీయాలపై కౌన్సిలర్లతో చర్చించారు. తమకు తాండూరులో భద్రత లేదని శ్రేణులు ఆందోళన వ్యక్తం చేయగా.. పైలెట్ పై విధంగా భరోసా ఇచ్చారు.
విద్యుదాఘాతంతో
ఆవు మృత్యువాత
యాచారం: విద్యుదాఘాతంతో ఆవు మృతి చెందిన సంఘటన హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ పీఎస్ పరిధిలోని కుర్మిద్ద అనుబంధ గ్రామం మంగలిగడ్డ తండాలో చోటు చేసుకుంది. నేనావత్ సోనాకు చెందిన రూ.50 వేల విలువ చేసే పాలిచ్చే ఆవు బుధవారం మధ్యాహ్నం ఓ ప్రైవేట్ కంపెనీ ఏర్పాటు చేసిన గదుల వద్దకు వెళ్లింది. అక్కడ స్తంభానికున్న స్టార్టర్ డబ్బాకు తగిలి విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఆవు మృతికి కారణమైన ప్రైవేట్ కంపెనీ యాజమాన్యమే నష్టపరిహారం చెల్లించాలని బాధిత రైతు డిమాండ్ చేశారు.
రాజేంద్రనగర్: ఆరాంఘర్ చౌరస్తా నుండి పీడీపీ చౌరస్తా వైపు వెళ్తున్న కారులో బుధవారం ఉదయం ఆకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో కారు నడుపుతున్న వ్యక్తి భయంతో కారు దిగి బయటికి వచ్చాడు. ఇదే సమయంలో రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ కరుణాకర్ అటుగా వెళుతూ వెంటనే స్పందించాడు. పక్కనే ఉన్న ఇంటి నుంచి పైపును తీసుకొని మంటలను అదుపులోకి తెచ్చాడు. 20 నిమిషాల అనంతరం మంటలు అదుపులోకి వచ్చాయి. అప్పటికే కారు దాదాపు 50 శాతం కాలిపోయింది.
అతి వేగమే ఉసురు తీసింది
గచ్చిబౌలి: ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు పేర్కొంటున్నారు. మంగళవారం నియో పోలీస్ సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డుపై ఆగిఉన్న లారీని కారు ఢీకొనడంతో కత్రావత్ సురేందర్ (19), ముత్యాల ప్రణతి రెడ్డి (20) మృతి చెందిన విషయం తెలిసిందే. కోకాపేట్ నుంచి కొల్లూరు వైపు వెళుతున్న కారు ఆగిఉన్న లారీని 120 కిలోమీటర్ల వేగంతో ఢీకొట్టి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. కారు మీటరు కూడా పగిలిపోవడంతో ఓఆర్ఆర్పై ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. అతివేగంగా వెళ్లడమే కాకుండా బ్రేక్ కూడా వేసే ప్రయత్నం చేయకపోవడంతో లారీ వెనక భాగంలో కారు కూరుకుపోయిందని చెబుతున్నారు. కారు నడిపిన సురేందర్కు లైసెన్స్ లేదని, డ్రైవింగ్ కూడా సరిగ్గా రాకపోవచ్చని పోలీసులు పేర్కొంటున్నారు. కొంతకాలంగా ఇద్దరూ స్నేహంగా ఉన్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే కారులో వెళ్లి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. బుధవారం ఉస్మానియా ఆస్పత్రిలో ముత్యాల ప్రణతి రెడ్డి, కత్రావత్ సురేందర్ మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం మరియాల గ్రామానికి ప్రణతి మృతదేహం, పక్కనే ఉండే నాయకుని తండాకు సురేందర్ మృతదేహాలను తరలించారు.


