మొయినాబాద్: కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలు మరోసారి భగ్గుమన్నాయి. జెడ్పీటీసీ మాజీ సభ్యుడు, ఎమ్మెల్యే కాలె యాదయ్య కుమారుడు కాలె శ్రీకాంత్, మున్సిపల్ చైర్పర్సన్ సోనియా భర్త, పీసీసీ సభ్యుడు షాబాద్ దర్శన్ మధ్య మాటల యుద్ధం నడిచింది. మరోవైపు పార్టీ కోసం కష్టపడ్డ వారికి కాకుండా ఇతర పార్టీల నుంచి కొత్తగా చేరినవారికి పదవులు కట్టబెడుతున్నారంటూ కార్యకర్తలు మండిపడ్డారు. మొయినాబాద్ మండల, మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ బీఎల్ఏల సమీక్ష సమావేశం బుధవారం పార్టీ కార్యాలయంలో చేవెళ్ల నియోజకవర్గం ఇన్చార్జి భీంభరత్ అధ్యక్షతన జరిగింది. సమావేశానికి రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ జ్ఞానేశ్వర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన ముందే పార్టీ నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. షాబాద్ దర్శన్, కాలె శ్రీకాంత్ మధ్య మాటల యుద్ధం కొనసాగింది. వేదికపై ఉన్న నాయకులంతా ఇద్దరిని సమాదాయించారు. నామినేటెడ్, పార్టీ పదవులను డబ్బులకు అమ్ముకుంటున్నారని.. కష్టపడ్డవారికి పదవులు దక్కడంలేదంటూ కార్యకర్తలు తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ పరిస్థితి మారకుంటే రాబోయే రోజుల్లో చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీలో ఎవరూ మిగలరని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని జ్ఞానేశ్వర్ హామీ ఇవ్వడంతో కార్యకర్తలు కాస్త వెనక్కితగ్గారు.
ఎస్ఐఆర్ వంద శాతం పూర్తి చేయాలి
ప్రత్యేక ఓటరు సమగ్ర సవరణ ప్రక్రియ(ఎస్ఐఆర్)ను అన్ని గ్రామాలు, వార్డుల్లో వంద శాతం పూర్తి చేసే విధంగా చూడాలని రాష్ట్ర ముదిరాజ్ కార్పొరోషన్ చైర్మన్ జ్ఞానేశ్వర్ అన్నారు. బీఎల్ఏల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఎన్యూమరేషన్ ఫారంలో సమగ్ర వివరాలు నమోదు చేసి వాటిని ఆన్లైన్లో అప్లోడ్ చేసే విధంగా బీఎల్ఏలు కృషి చేయాలన్నారు. సమావేశంలో చేవెళ్ల నియోజకవర్గం ఇన్చార్జి భీంభరత్, పీసీసీ అధికార ప్రతినిధి గౌరి సతీష్, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


