● సర్వేకు రైతులు సహకరించాలి
● అడిషనల్ కలెక్టర్ వెంకటాచారి
దోమ: రేడియల్ రోడ్డు, పారిశ్రామిక వాడకు భూములు ఇచ్చే రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, అన్ని విధాలా ఆదుకుంటుందని అడిషనల్ కలెక్టర్ వెంకటాచారి అన్నారు. బుధవారం మండలంలోని కొండాయపల్లిలో ఆర్డీఓ వాసుచంద్రతో కలిసి ప్రజాభిప్రాయ సేకరణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు సర్వేకి సహకరించాలని కోరారు. మెరుగైన పరిహారం అందించడం తోపాటు, నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు చెప్పారు. ఎవరూ ఆందోళన చెందాల్సి పని లేదన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ రవీందర్, డీటీ నర్సింహులు, ఆర్ఐలు వెంకటేశ్, రాంచంద్రరావు, జీపీఓలు, వీఆర్ఏలు, గ్రామ రైతులు పాల్గొన్నారు.
సమాచారం ఇవ్వలేదు
భూములు కోల్పోతున్న తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని, పోలీసు బందోబస్తు మధ్య తూతూ మంత్రంగా సమావేశం నిర్వహించారని గ్రామానికి చెందిన నిమ్మలి సాయిలు, ఇరుకుంట భీములు, వార్ల నరేందర్ మరి కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో 456 ఎకరాల భూములు పోతాయని కేవలం కొంత మంది రైతులతో సమావేశం నిర్వహించడం ఏమిటని వారు ప్రశ్నించారు. చాలా మంది రైతులు హైదరాబాద్లో ఉంటున్నారని ముందుగా సమాచారం ఇవ్వకపోవడంతో వారు రాలేదన్నారు. బలవంతంగా భూములు లాక్కోవాలని చూస్తే ఉద్యమం చేస్తామని రైతులు హెచ్చరించారు.


