అనంతగిరి: తక్కువ నీటితో ఎక్కువ ఆదాయం వచ్చే పూలు, పండ్లు, కూరగాయల వంటి పంటలు సాగు చేయాలని కలెక్టర్ దీపక్ తివారి సూచించారు. శుక్రవారం వికారాబాద్ మండలం మదనపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో మహిళా రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యాన పంటల సాగుతో లాభాలు పొందవచ్చని తెలిపారు. ఆయిల్ పామ్ సాగుకు ప్రభుత్వం అనేక రాయితీలు ఇస్తోందన్నారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వరి స్థానంలో ప్రత్యామ్నాయ పంటల సాగు చేయాలన్నారు. ఆర్గానిక్ పంటలకు మంచి డిమాండ్ ఉందన్నారు. ఉద్యాన శాఖ ఎండీహెచ్ పథకం కింద సెర్ప్ డీఆర్డీఓ సహకారంతో మహిళా రైతు అలివేలు షేడ్ నెట్లో సాగు చేస్తున్న చామంతి పంటను పరిశీలించారు. ఈ విధానంలో పంటలు సాగు చేస్తే చీడపీడల సమస్య ఉందన్నారు. అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంటుందన్నారు. అనంతరం సర్ ప్రక్రియపై సంబంధిత అధికారులతో చర్చించారు. ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్ను తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని సూచించారు. కార్యక్రమంలో ట్రైయినీ కలెక్టర్ సచిన్ బస్వరాజ్ గుట్టూర్, డీఆర్డీఏ శ్రీనివాస్, ఉద్యాన శాఖ జిల్లా అధికారి సత్తార్, ఎంపీడీఓ వినయ్కుమార్, తహసీల్దార్ లక్ష్మీనారాయణ, సర్పంచ్ జయలక్ష్మి, డీఈఓ మహమ్మద్ అబ్దుల్ ఘని, కేఏటీ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.
త్వరలో విద్యార్థులకు యూనిఫాం
విద్యార్థులకు త్వరలో రెండు జతల యూనిఫాంలు పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ దీపక్ తివారి తెలిపారు. శుక్రవారం నగరం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్యార్థుల యూనిఫాంపై పలు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. వీలైనంత త్వరగా విద్యార్థులకు యూనిఫాం అందేలా చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీనివాస్, జిల్లా పంచాయతీ అధికారి జయసుధ, సీసీఓ వెంకటేశ్వర్లు, డీఏఓ కవిత, జిల్లా ఉద్యాన శాఖ అధికారి సత్తార్ తదితరులు పాల్గొన్నారు.
ఆయిల్ పామ్ సాగుకు ప్రభుత్వ ప్రోత్సాహం
కలెక్టర్ దీపక్ తివారి
మహిళా రైతులతో సమావేశం


