అనంతగిరి: వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన బాలబాలికలు పీఎం రాష్ట్రీయ బాల పురస్కార్ – 2026కు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి కాంతారావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 6 నుంచి 18 సంవత్సరాలలోపు బాలబాలికలు అర్హులని తెలిపారు. సోషల్ సర్వీస్, క్రీడలు, ధైర్య సాహసాలు, పర్యావరణం, కళలు, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి రంగాల్లో ప్రావీణ్యం కలిగి ఉండాలని తెలిపారు. జాతీయ అవార్డు పోర్టల్లో జూలై 31 తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు ప్రతిని జిల్లా శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.
బాలుడి అరెస్టు, రిమాండ్కు తరలింపు
తాండూరు టౌన్: పక్కా సమాచారంతో తాండూరు పట్టణ పోలీసులు శుక్రవారం ఓ బాలుని వద్ద 10కిలోల గంజాయిని స్వాఽధీనం చేసుకున్నారు. పట్టణ సీఐ పరమేశ్వర్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రానికి చెందిన 17 ఏళ్ల బాలుడు కోణార్క్ ఎక్స్ప్రెస్ రైలులో తాండూరుకు వచ్చాడు. అప్పటికే మాటు వేసిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని బ్యాగ్ను తనిఖీ చేశారు. అందులో 10 కిలోల గంజాయి లభ్యమైంది. బాలున్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. తనిఖీల్లో పట్టణ ఎస్ఐ నుమాన్ అలీ, సిబ్బంది పాల్గొన్నారు.


