తాండూరు: వర్షపు నీటిని వృథాగా పోనివ్వమని, ప్రతి చుక్కా చెరువుల్లోకి చేరేలా చర్యలు తీసుకుంటున్నట్లు నీటి పారుదల శాఖ ఈఈ అశోక్ తెలిపారు. బుధవారం పట్టణంలోని నీటి పారుదల శాఖ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. డివిజన్ పరిధిలోని డీఈఈలు, ఏఈలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయా మండలాల్లోని చెరువుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తాండూరు మండలం జిన్గుర్తిలోని శ్రీరాముల ప్రాజెక్టు ఆధునీకరణకు రూ.3 కోట్లతో ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. పెద్దేముల్ మండలం పాషాపూర్లో తెగిన సీతమ్మ చెరువును రూ.45 లక్షలతో పునర్నిర్మించనున్నట్లు తెలిపారు. మోమిన్పేట్ నందివాగు ప్రాజెక్టు వద్ద రూ.1.8 కోట్లతో బతుకమ్మ ఘాట్, వినాయకుడి విగ్రహాల నిమజ్జన ఘాట్లను నిర్మించనున్నట్లు చె ప్పారు. కాగ్నా, కకరవేణి నదులపై 12 చెక్ డ్యామ్లకు గాను 11 పూర్తి చేసినట్లు తెలిపారు. యాలాల మండలం జుంటిపల్లి ప్రాజెక్టు ఆధునీకరణ కోసం రూ.4.75 కోట్లు మంజూరైనట్లు వివరించారు. ఆరు నెలల క్రితం టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ పనులు చేయకపోవడంపై నోటీసులు ఇస్తామన్నారు. కోట్పల్లి ప్రాజెక్టు ఽఆధునీకరణ పనులు చురుగ్గా సాగుతున్నాయని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 50శాతం మేర పనులను పూర్తి చేశామని తెలిపారు. కుడి, ఎడమ, బేబీ కెనాల్ను ఆధునీకరిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో నీటి పారుదల శాఖ డీఈఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.


