● కుటుంబాలతో కలిసి 48 గంటల నిరాహార దీక్ష
●
తిరుపతి రూరల్: తమ కడుపు కొట్టద్దంటూ విద్యుత్ శాఖలో పనిచేస్తున్న బిల్లు కలెక్టర్లు మొరపెట్టుకుంటున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి స్థానిక ఎస్పీడీసీఎల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట దీక్షకు బూనుకున్నారు. తన భర్త ఉద్యోగం కాపాడాలని ఓ మహిళ గుండెలు బాదుకోగా.. తన తండ్రి ఉద్యో గం కాపాడండి.. అంటూ పసి పిల్లలు వేడుకున్న ఘటనలు చూపరుల కళ్లు చెమర్చేలా చేశాయి. కర్నూలు జిల్లాకు చెందిన ఓ బిల్ కలెక్టర్ తన ఐదేళ్ల పాపను చూపిస్తూ.. ఉద్యోగం పోతే ఈ బిడ్డను ఎలా పోషించాలి.. అంటూ కన్నీరుమున్నీరయ్యా రు. గత 35 ఏళ్లుగా సంస్థను నమ్ముకుని బతికిన తమకు ఉద్యోగం తొలగింపుతో ‘ఉసురు తీయకండి.. ఉపాధి కల్పించండి.. 35 ఏళ్ల సేవలకు కనీస గౌరవం ఇవ్వండి’ అంటూ చంద్రబాబు ప్రభుత్వా న్ని, ఏపీఎస్పీడీసీఎల్ యాజమాన్యాన్ని వేడుకున్నారు.
ఉసురు తీయాలనుకుంటే ఊరుకోం
బిల్కలెక్టర్లు, వారి కుటుంబీకులు చేస్తున్న నిరాహార దీక్షకు సీఐటీయూ, ఏపీ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నేతలు మద్దతు తెలిపారు. కూటమి ప్రభుత్వానికి, ఏపీఎస్పీడీసీఎల్ అధికారుల తీరుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పలువురు యూనియన్ నేతలు మాట్లాడుతూ డిజిటలైజేషన్ పేరుతో బిల్ కలెక్టర్లను ఏకపక్షంగా తొలగించడం దారుణమని మండిపడ్డారు. తక్షణమే ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని సూచించారు. వారి విద్యార్హతలకు అనుగుణంగా ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ దీక్షలో యూనియన్ నాయకులు జయచంద్ర, టి.కుమార్ సుబ్రహ్మణ్యం, పెంచలప్రసాద్, నాగమణి, గిరిబాబు, ప్రసన్నకుమార్, జ్యోతిబసు, లక్ష్మీపతి, హేమలతతో పాటు తొమ్మిది జిల్లాలకు చెందిన బిల్ కలెక్టర్స్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు.
ఉద్యోగులకు కోతలా?
విద్యుత్ సంస్థలో చోటుచేసుకుంటున్న పరిణామాలు చూస్తుంటే బాధ కలుగుతోంది. ఆదానీ వంటి కార్పొరేట్ సంస్థలకు వేల కోట్ల విలువై న కాంట్రాక్టులు, భారీ చెల్లింపులు చేస్తున్న విద్యుత్ పంపిణీ సంస్థలు కార్మికుల విషయంలో ఎందుకు ఇంత దారుణానికి పాల్పడుతారు?. ఏపీఎస్పీడీసీఎల్ అధికారులు అత్యుత్సాహంతో అందరికంటే ముందుగా వంద మంది బిల్కలెక్టర్ల ఉద్యోగాలు తొలగించడం దారుణం.
– కందారపు మురళి, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు
కడుపుకొట్టే చర్యలు ఆపాలి
ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో గత 35ఏళ్లుగా పనిచేసిన బిల్ కలెక్టర్ల కడుపుకొట్టే చర్యలను యాజమాన్యం నిలిపివేయాలి. ప్రత్యామ్నా య ఉపాధి చూపించిన తరువాతనేడిజిటలైజేషన్ అమలు పరచాలి. విద్యు త్ బిల్లుల చెల్లింపులో డిజిటలైజేషన్ను గ్రామీణ ప్రాంతాల వినియోగదారులు వ్యతిరేకిస్తున్నా లెక్క చేయడం లేదు. – డి.సూరిబాబు, రాష్ట్ర అధ్యక్షుడు,
యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్
కార్మికులపై కూటమి కక్ష
కార్మికులపై కూటమి ప్రభుత్వం కక్ష గట్టింది. అందుకే ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో ఉన్న బిల్కలెక్టర్లను ఒక నోటీసుతో ఇంటికి పంపుతున్నారు. వారికి ఉద్యోగ భద్రత కల్పించి న్యాయం జరిగేంత వరకు పోరాడుతాం. అవసరమైతే ఏపీఎస్పీడీసీఎల్ కార్యాలయంను దిగ్భందిస్తాం. – బొజ్జ సుమన్,
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,
కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్
ఎలా పోషించాలి
కరోనా వంటి కష్టకాలంలో కూడా ఏపీఎస్పీడీసీఎల్ ఆర్థికాభివృద్ధికి కష్టపడిన బిల్కలెక్టర్ల బతుకులు చిదిమేయడం అధికారులకు మంచిది కాదు. ఉన్నఫలంగా ఉద్యోగం పోతే మేము ఎలా బతకాలి.? కుటుంబాలను ఎలా పోషించాలి ? ప్రత్యామ్నాయ ఉపాధి చూపండి.
– పి.వెంకటరమణ, రాష్ట్ర అధ్యక్షుడు,
ఏపీ బిల్ రీడర్స్ యూనియన్


