తిరుమల: గరుడ పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం తిరుమలలో శ్రీమలయప్ప స్వామివారు గరుడ వాహనాన్ని అధిరోహించి మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. రాత్రి 7 గంటలకు గరుడ వాహనసేవ ప్రారంభమైంది. కార్యక్రమంలో తిరుమల పెద్ద జీయర్ స్వామి, చినజీయర్ స్వామి, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్యచౌదరి పాల్గొన్నారు.
30 నుంచి వరుణ జపం
తిరుమల: రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలని, సకాలంలో వర్షాలు కురవాలని శ్రీవారిని ప్రార్థి స్తూ ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 3వ తేదీ వరకు కారీరిష్టి యాగం, వరుణజపం, పర్జన్యశాంతి హోమాలను టీటీడీ నిర్వహించనుంది. తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 32 మంది వేద, శ్రౌత, స్మార్థపండితులు యాగ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. సెప్టెంబర్ 3న మహాపూర్ణాహుతి నిర్వహించనున్నారు. ధర్మగిరి వేద విజ్ఞన పీఠం ప్రిన్సి పల్ శ్రీకుప్పా శివసుబ్రహ్మణ్య అవధాని ఆధ్వర్యంలో ఇందు కోసం ఏర్పాట్లు సాగుతున్నాయి.
లా పరీక్షలు వాయిదా
తిరుపతి సిటీ: ఎస్వీయూ పరిధిలో ఈనెల 19 నుంచి వచ్చే నెల 3 వరకు జరగనున్న లా కోర్సులకు సంబంధించిన పలు యూజీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ రాజామాణిక్యం తెలిపారు. పరిపాలనా సాంకేతిక కారణాలతో మూడేళ్ల లా కోర్సుకు సంబంధించి 1వ, 3వ, 5వ సెమిస్టర్ పరీక్షలతో పాటు ఐదేళ్ల లా కోర్సుకు సంబంధించి 1వ, 3వ, 5వ, 7వ, 9వ సెమిస్టర్ పరీక్షలను సైతం వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. తదుపరి పరీక్షల నిర్వహణ తేదీలను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.
శ్రీవారి దర్శనానికి 18 గంటలు
తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. ఆదివారం అర్ధరాత్రి వరకు 97,014 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 37,108 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.93 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 18 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.


