● అర్హులైన నేతన్నలకు న్యాయం చేయండి ● పీజీఆర్ఎస్లో కలెక్టర్కు వినతిపత్రాన్ని ఇచ్చిన ఎంపీ గురుమూర్తి
తిరుపతి అర్బన్: ‘సంక్షేమ పథకాల అమలులో రాజకీయాలకు చోటివ్వకండి’ అని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్కు సూచించారు. సోమవారం ఆయన కలెక్టరేట్లో నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్లో చేనేత కార్మికులతో కలసి కలెక్టర్ను కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ మగ్గాలు ఉన్న నిజమైన చేనేత కార్మికులను పక్కన పెట్టి.. మృతి చెందిన వారి పేర్లతో, అసలు మగ్గాలు లేని వారి పేర్లతో చేనేత పథకాన్ని అమలు చేయడం దారుణమన్నారు. కొందరు దుబాయ్లో ఉంటే వారి పేర్లు పథకం కోసం జిల్లాలో పలు చోట్ల అమలు చేయడం సరికాదన్నారు. మగ్గాలతోనే జీవనం సాగిస్తున్న 150 మంది చేనేత కార్మికులకు సంక్షేమ పథకాలు పొందడానికి వంద శాతం అర్హత ఉన్నా వారిని పక్కన పెట్టారని ఆవేదన చెందారు. ఈ మేరకు అర్హుల వివరాలను కలెక్టర్కు అందించారు. చేనేత కార్మికుల జాబితాపై క్షేత్ర స్థాయిలో సమగ్రంగా పరిశీలన జరిపి.. నిజమైన అర్హులను గుర్తించి వారికి పథకం ద్వారా న్యాయం చేయాలని కోరారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అర్హతే ప్రామాణికంగా తీసుకుని సంక్షేమ పథకాలను అమలు చేశామని ఎంపీ గుర్తుచేశారు. ఆ మేరకు కలెక్టర్కు ఓ వినతిపత్రాన్ని అందించారు.
పోలీస్ గ్రీవెన్స్కు 87 అర్జీలు
తిరుపతి క్రైం: తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 87 ఫిర్యాదులు అందినట్టు ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు తెలిపారు. ఇందులో దొంగతనాలు, ఆస్తి తగాదాలు, ఆర్థికపరమైన లావాదేవీలు ఉన్నాయన్నారు. వెంటనే సంబంధిత అర్జీలు పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు.


