తిరుపతి రూరల్: అంతర్జాతీయ విద్యార్థులతో సాంస్కృతిక విద్యా పరస్పర మార్పిడికి వేదికగా శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నిలుస్తోంది. సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆధ్వర్యంలో పీఎం–ఉషా కార్యక్రమం కింద భారతీయ వారసత్వం, సంస్కృతిపై వారం రోజుల బ్రిడ్జ్ కోర్స్ను నిర్వహిస్తున్నారు. మలేషియా, తైవాన్, బంగ్లాదేశ్, బోట్స్వానాకు చెందిన విద్యార్థులతో పాటు మహిళా యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు ఇందులో పాల్గొంటున్నారు. ఏడు అకడమిక్, అంతర్ సాంస్కృతిక సెషన్లతో పాటు మూడు ప్రాయోగిక, ప్రదర్శన ఆధారిత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీసీ ఉమ, సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ డీన్ ప్రొఫెసర్ పి.విజయలక్ష్మి, అసోసియేట్ డీన్ ప్రొఫెసర్ టిజి.అమృతవల్లి, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఆర్ఎన్ఎస్.శైలేశ్వరి పాల్గొన్నారు.


