అప్పుల ఊబిలో సమగ్ర శిక్ష ఉద్యోగులు
శాపంగా మారిని సాంకేతిక లోపం..
తిరుపతి ఎడ్యుకేషన్ : ఎన్నికల హామీలో భాగంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని ప్రగల్భాలు పలికారు. రెగ్యులరైజ్ కానిపక్షంలో మినిమమ్ టైం స్కేలును వర్తింపజేస్తామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని నమ్మబలికారు. సమాన పనికి సమాన వేతనం ఇస్తామంటూ హామీలిచ్చారు. డబుల్ ఇంజిన్ సర్కారుతో రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తామంటూ ఊదరగొట్టి ఓట్లు దండుకున్నారు. తీరా అధికారంలోకి వచ్చి రెండేళ్లకు పైగా అవుతున్నా ఏ ఒక్క హామీ అమలుకు నోచుకోలేదు. దీనిపై ఉద్యోగులు పెదవి విరుస్తున్నారు. హామీలు దేవుడెరుగు.. కనీసం నెలవారి జీతాలైనా సక్రమంగా ఇవ్వాలంటూ నిట్టూరుస్తున్నారు.
సిబ్బందితో వెట్టిచాకిరీ
తిరుపతి జిల్లా సమగ్ర శిక్షలో దాదాపు 600 మంది వరకు సీఆర్ఎంటీ, ఆఫీస్ సబ్బార్డినేట్, ఎంఐఎస్, డేటా ఎంట్రీ ఆపరేటర్ వంటి పోస్టుల్లో కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాల నిర్వహణ, కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాలు, ప్రత్యేకావసరాలు ఉన్న పిల్లలకు సేవలందించడం, విద్యా సర్వేలు, డేటా నిర్వహణతో పాటు విద్యార్థులకు విద్యాకానుక కిట్లను సకాలంలో పాఠశాలలకు చేరవేయడం వంటి అన్ని రకాల పనులను వీరితో చేయించుకుంటున్నారు. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా వీరితో పనులు చేయించుకుంటున్నా వీరికిచ్చే జీతం చాలా తక్కువ అంటూ వాపోతున్నారు.
అప్పుల ఊబిలో..
సమగ్ర శిక్షలో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ సిబ్బందికి రూ.17 వేల నుంచి రూ.27 వేల వరకు వేతనం చెల్లిస్తున్నారు. అయితే జూన్, జూలై నెలలకు సంబంధించిన వేతనాలు రాకపోయే సరికి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికై నా రెగ్యులర్ కాకపోతామన్న ఆశతో చాలీచాలని జీతమైనప్పటికీ తమ విధులను నిర్వహిస్తున్నామని చెబుతున్నారు.
ఎస్ఎస్ కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ సిబ్బందికి అందని జీతాలు
శాపమైన సాంకేతిక లోపం
కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రతి నెలా జీతాలు ఇస్తున్నారు. అయితే ఇటీవల వీరికి సీఎఫ్ఎంఎస్ ఐడీని రూపొందించి తద్వారా జీతాలు చెల్లించేందుకు కూటమి సర్కారు చర్యలు తీసుకుంది. అయితే ఈ ఐడీ రూపకల్పనలో ఏర్పడ్డ సాంకేతిక లోపాన్ని ఇంతవరకు అధిగమించకపోవడంతో జీతాలు అందక ఖాళీ జేబులతో ఉద్యోగులు బిక్కుబిక్కుమంటున్నారు. త్వరగా జీతాలు అందించి తమను అప్పుల ఊబి నుంచి రక్షించాలంటూ వేడుకుంటున్నారు.


