వెంకటగిరి రూరల్: కష్టపడి చదివి సంపాదించుకున్న ఉద్యోగం వదులుకోలేక.. కట్టుకున్న భర్త మాటలను కాదనలేక ఓ మహిళా పోలీసు తీవ్ర క్షోభకు గురైంది. దిక్కుతోచని స్థితిలో ఉరితాడునే ఉంచుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన వెంకటగిరి సున్నపు వీధిలో కలకలం రేపింది. పోలీసుల కథనం.. వెంకటగిరి సున్నపు వీధికి చెందిన శాంతి(31) అదే ప్రాంతానికి చెందిన భీమలింగాన్ని 2024లో వివాహం చేసుకుంది. శాంతికి గత 2019లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో మహిళా పోలీసుగా ప్రభుత్వం ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం వెంకటగిరి మండలం, పారవోలు సచివాలయంలో శాంతి మహిళా పోలీసుగా విధులు నిర్వహిస్తోంది. శాంతి భర్త భీమలింగం ఉపాధి నిమిత్తం ఐర్లండ్కు వెళ్లి అక్కడే ఉంటున్నాడు. అప్పడప్పుడూ స్వగ్రామానికి వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించేవాడు. ఈ క్రమంలో తన భార్య శాంతిని ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి తనతోపాటు ఐర్లండ్కు తీసుకెళ్లాలని ప్రణాళిక రచించాడు. ఈ క్రమంలో ఆమెకు పలు మార్లు ఫోన్లు చేసి ఒత్తిడి పెంచాడు. కానీ కష్టపడి సంపాదించిన ప్రభుత్వ ఉద్యోగాన్ని వదల్లేక శాంతి భర్తకు చాలా సార్లు సర్దిచెప్పింది. అయినప్పటికీ అతను గట్టిగా పట్టుబట్టడంతో మనస్తాపానికి గురైంది. ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఉరివేసుకుని తనువు చాలించింది. శాంతి మృతికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని వెంకటగిరి పోలీసులు తెలిపారు.


