కాళహస్తి రూరల్: శ్రీకాళహస్తి మండలంలో టీడీపీ కార్యకర్తలు కొందరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. గ్రామానికి తాగునీరు అందించే బోరు బావి నుంచి పొలాలకు మళ్లించి వేడుక చూస్తున్నారు. ఇలాంటి ఘటనే మండలంలోని ఇనగలూరు పంచాయతీలో చోటు చేసుకుంది. ఇనగలూరు గ్రామంలో సుమారు 250 కుటుంబాలు ఉన్నాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో తాగునీటి కోసం మూడు బోర్లు వేసి, వాటికి మోటార్లు ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి గ్రామంలోని రెండు ట్యాంకులకు తాగునీరు వెళ్లేలా చర్యలు చేపట్టారు. అయితే ఇటీవల కొందరు టీడీపీ కార్యకర్తలు ఎండలకు తమ పంటలు ఎండిపోతున్నాయన్న సాకుతో ఏకంగా పంచాయతీకి చెందిన తాగునీటి బోర్ల నుంచి పొలాలకు నీటిని మళ్లించారు. దీంతో గ్రామంలో తాగునీటి ఎద్దడి నెలకొంది. తాగడానికి నీరులేక అల్లాడుతుంటే.. ఇదేం పని..? అంటూ పలువురు నిట్టూర్చుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించాల్సి ఉంది.


