రేణిగుంట: మండలంలోని తూకివాకం రెవెన్యూ సర్వే నం.6 మర్రిగుంట చెరువు వద్ద ఉన్న దేవదాయ శాఖ భూమిలోకి ఎవరూ ప్రవేశించకుండా సోమవారం ఎండోమెంట్ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ రామకృష్ణ ఆధ్వర్యంలో ట్రెంచ్ను తవ్వారు. ఇటీవల స్థానిక అధికార పార్టీ నాయకుల అండతో కొందరు ఇదే సర్వే నంబర్లో పది ఎకరాలు తమవని చెబుతూ ఆక్రమించుకునే ప్రయత్నం చేసిన విషయం విధితమే. అందులో భాగంగా దేవదాయ భూమి అన్యాక్రాంతం కాకుండా కాపాడేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. రామకృష్ణా మాట్లాడుతూ అనుమతులు లేకుండా దేవదాయ శాఖ భూముల లోకి ఎవరైనా ప్రవేశిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నిందితుడి అరెస్ట్
రేణిగుంట: సహజీవనం చేసిన మహిళ తనతో మాట్లాడడం లేదన్న కారణంగా కత్తితో పొడిచిన ఘటనలో నిందితుడు పై హత్యాయత్నం కేసు నమోదు చేసిన గాజులమండ్యం పోలీసులు సోమవారం అరెస్టు చేసి న్యాయస్థానం ఎదుట హాజరు పరిచినట్లు రేణిగుంట రూరల్ సీఐ మంజునాథరెడ్డి తెలిపారు. ఆయన కథనం.. మండలంలోని రామకృష్ణాపురంలో నివాసముంటున్న ఆర్.కుమార్ తనతో గతంలో సహజీవనం చేసిన మహిళ ఫోన్ నంబర్ను బ్లాక్ చేయడంతో ఆమైపె ద్వేషం పెంచుకున్నాడు. ఈనెల 1వ తేదీ రేణిగుంట సంత సమీపంలో కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనపై గాజుల మండ్యం పోలీస్ స్టేషన్లో హత్యాయత్నం కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్టు చేసి విచారించగా నేరాన్ని అంగీకరించినట్టు సీఐ తెలిపారు.
చోరీ కేసులో నిందితుడి అరెస్టు
సత్యవేడు: దాసుకుప్పం, సురుటుపల్లి గ్రామా ల్లో పలువురి ఇళ్లల్లో చోరీకి సంబంధించిన కేసుల్లో దాసుకుప్పంకు చెందిన గోవర్దన్ (‘26) అనే పాత నేరస్తుడిని అరెస్టు చేసినట్లు ఎస్ఐ సాయినాథ్చౌదరి తెలిపారు. నిదితుడిపై పదికిపైగా కేసులు ఉండగా పలుమార్లు జైలుకు వెళ్లి వచ్చాడన్నారు. అతని వద్ద నుంచి చోరీ చేసిన బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. సోమవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచగా.. నిందితుడికి ఈనెల 17వ తేదీ వరకు రిమాండ్ విధించినట్టు చెప్పారు.
భాకరాపేటలో
మళ్లీ ఏనుగుల దండు
భాకరాపేట: చిన్నగొట్టిగల్లు మండలం, భాకరాపేట పంచాయతీ పరిధిలో ఆదివారం రాత్రి ఏనుగుల గుంపు హల్చల్ చేసింది. పలు పంటలను తొక్కి నాశనం చేశాయి. గ్రామ శివారులోని రైతులకు చెందిన వరి పంటని పూర్తిగా తొక్కేశాయి. వీటితోపాటు ఇతర పొలాల్లోకి ప్రవేశించిన ఏనుగులు ఫెన్సింగ్, కంచెలు, కూసాలను విరగ్గొట్టాయి. రైతులు తీవ్ర నష్టానికి గురయ్యారు. ఏనుగుల సంచారంతో గ్రామస్తులు రాత్రంతా కంటిమీద కునుకులేకుండా గడపాల్సిన దుస్థితి ఏర్పడింది.
స్కానింగ్ సెంటర్లో తనిఖీలు
చిత్తూరు రూరల్(కాణిపాకం): చిత్తూరు నగరం మురుకంబట్టులోని అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్, అపోలో క్లినిక్లో ఉన్న స్కానింగ్ సెంటర్ను సోమవారం జిల్లా అదనపు వైద్య, ఆరోగ్య అధికారి జి.వెంకటప్రసాద్ తనిఖీ చేశారు. చేంజ్ ఆఫ్ అడ్రస్, స్కానింగ్ సెంటర్లో అందిస్తున్న సేవలపై ఆరా తీశారు.


