– అనుమానంతోనే భార్యపై దాడి
తిరుపతి రూరల్: అనుమానమే.. పెనుభూతమై.. భార్యను కడతేర్చిన ఘటన తిరుపతి రూరల్ మండలం, వెంకటపతి నగర్లో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం.. గురవమ్మ అలియాస్ కస్తూరి (21) అనే యువతిని ఆమె భర్త సురేష్ దారుణంగా హత్యచేశాడు. టిప్పర్ డ్రైవర్గా పనిచేస్తున్న సురేష్ మద్యానికి బానిసై తరచూ భార్యతో గొడవపడేవాడు. భార్య చేతిలో ఫోన్ పట్టుకుంటే ఎవరితోనో వివాహేతర సంబంధం నడుపుతున్నట్టుగా భావించి తరచూ వేధించేవాడు. దీంతో ఇరువురి మధ్య వివాదం చోటుచేసుకుంది. ఎప్పటిలాగానే సోమవారం మధ్యాహ్నం మద్యం సేవించి ఇంటికి వచ్చిన సురేష్ తన భార్య కస్తూరి ఫోన్ ఇవ్వాలని అడిగాడు. అందుకు ఆమె నిరాకరించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి లోనైన సురేష్ దోసెల పెనంతో కస్తూరి తలపై మోదాడు. దీంతో ఆమె అపస్మారక స్థితికి చేరుకుంది. స్థానికులు కస్తూరిని చికిత్స నిమిత్తం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే కస్తూరి మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మృతురాలు కస్తూరి, సురేష్కు హర్షిత అనే మూడేళ్ల కుమార్తె ఉంది. తల్లి మృతితో ఆ చిన్నారి తల్లిలేని బిడ్డగా మిగిలింది. సమాచారం అందుకున్న తిరుపతి రూరల్ పోలీసులు ఆస్పత్రికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. మృతురాలి భర్త సురేష్ను అదుపులోకి తీసుకున్న దర్యాప్తు చేపట్టారు.


