పెళ్లకూరు: అధికార అండతో టీడీపీ నాయకులు ‘మాఫియా డాన్ల’ అవతారమెత్తుతున్నారు. కొండలు, గుట్టలు, చెరువులు, కాలువలు, అటవీ భూములను భారీ యంత్రాలతో కొల్లగొడుతున్నారు. నాయుడుపేట, దొరవారిసత్రం, మేనకూరు ప్రాంతాల్లో ఇటుక బట్టీలు, వెంచర్లు, పరిశ్రమలకు లారీలు, టిప్పర్లు, ట్రాక్టర్లు ద్వారా యథేచ్ఛగా మట్టి, గ్రావెల్ విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. టీడీపీ నాయకుల అనుమతుల మాటున చెంబేడు, రోసనూరు చెరువుల్లో యంత్రాలతో మట్టి, గ్రావెల్ను ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. నాయుడుపేట, మేనకూరు ప్రాంతాల పరిధిలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న లేఅవుట్లకు తరలించి జేబులు నింపుకుంటున్నారు. చెరువుల్లో గ్రావెల్ తవ్వకాలు చేపట్టరాదని కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ ఇక్కడి టీడీపీ నాయకులు పట్టించుకోవడం లేదు. ఈ విషయమై స్థానిక తహసీల్దార్ హరికృష్ణను వివరణ కోరగా ఇరిగేషన్, మైనింగ్ అధికారుల నుంచి అనుమతులు పొందినట్లు తెలిపారు. అయితే ఇక్కడ జరుగుతున్న అధికార పార్టీ నేతల దోపిడీని కలెక్టర్ నేరుగా పర్యవేక్షించి అవినీతి నేతలపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.


