తిరుపతి రూరల్ : పాకాల మండలం దామలచెరువు పంచాయతీలో ఇద్దరు బాలురు అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. వారు సోమవారం ఇంటి నుంచి వెళ్లారు. తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. అదృశ్యమైన వారిలో సి.సంతోష్ (15) దామలచెరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి, సి.హర్ష (13) అదే పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నారు. వీరిద్దరూ ఒకేసారి కనిపించకుండా పోవడంతో వారి తల్లి సునీత బుధవారం పాకాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాలురి ఆచూకీ తెలిసిన వారు వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు, పాకాల పోలీసులను సంప్రదించి సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. కుటుంబ సభ్యులు బాలుర కోసం ఆందోళనతో ఎదురుచూస్తుండగా ట్యూషన్కు వెళ్లివస్తామని చెప్పి ఇంటికి తిరిగిరాలేదని ఆ తల్లి విలపిస్తోంది.


