తిరుపతి క్రైం : ప్రతిభావంతులైన పోలీస్ కుటుంబాల విద్యార్థులకు బుధవారం తిరుపతి జిల్లా పోలీస్ కార్యాలయంలో మెరిట్ స్కాలర్షిప్లు అందజేశారు. జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు మాట్లాడుతూ పోలీస్ ఉద్యోగులు విధి నిర్వహణలో చూపే క్రమశిక్షణ, అంకితభావం, బాధ్యత, కష్టపడే తత్వాన్ని పిల్లలు చిన్నప్పటి నుంచే అలవర్చుకుంటారని తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణ, సమయపాలన, పట్టుదల, ఆత్మవిశ్వాసంతో లక్ష్యాల వైపు పయనిస్తే ఉన్నత శిఖరాలు చేరుకోవచ్చన్నారు. పిల్లల ఆసక్తి, సామర్థ్యం, ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలన్నారు. పోలీస్ కుటుంబాల పిల్లలు ఐఐటీ, జేఈఈ, ఎంబీబీఎస్, ఇంజినీరింగ్ తదితర కోర్సుల్లోనే కాకుండా విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించడం సంతోషంగా ఉందన్నారు. మెరిట్ స్కాలర్షిప్లకు దరఖాస్తు చేసే సమయంలో సాంకేతిక కారణాలతో ప్రక్రియ పూర్తి చేయలేకపోయిన అర్హులైన విద్యార్థులకు కూడా పోలీస్ వెల్ఫేర్ విభాగం ద్వారా తగిన సహాయం అందిస్తామని ఎస్పీ హామీ ఇచ్చా రు. అనంతరం స్కాలర్షిప్పులు అందుకున్న విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు రవి మనోహరాచారి (శాంతిభద్రతలు), ఐ.రామకృష్ణ (తిరుమల), శ్రీనివాసరావు (సాయుఽ ద దళం), అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సురేష్కుమార్, పలువురు డీఎస్పీలు, ఇన్స్పెక్టర్లు, పోలీస్ వెల్ఫేర్ విభాగం అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.


