ఏర్పేడు: సద్గురు మలయాళ స్వామి స్థాపించిన వ్యాసాశ్రమంపై కొందరు చేస్తున్న దుష్ప్రచారాన్ని మానుకోవాలని పీఠాధిపతి పరిపూర్ణానంద గిరి స్వామి కోరారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. వ్యాసాశ్రమంలో సద్గురు మలయాళ స్వామి ఆశయాలను అనుసరిస్తూ దేశ, విదేశాల్లో ఆధ్యాత్మిక ప్రవచనాలు చేస్తున్నట్లు చెప్పారు. ఆశ్రమంలో 500 మంది విద్యార్థినులు చదువుతున్నారని, వారు మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతూ ఆశ్రమ ఖ్యాతిని చాటుతున్నారని తెలిపారు. ఆశ్రమంలో త్వరలోనే కంటి, జనరల్ ఆస్పత్రి భవన నిర్మాణాన్ని ప్రారంభించి ఆస్పత్రులను పునరుద్ధరిస్తామన్నారు. ఆగస్టు 27 నుంచి వారం రోజుల పాటు వ్యాసాశ్రమ శత జయంతి వేడుకలు ఘనంగా జరుపుతామని తెలిపారు. కొందరు పూర్వ విద్యార్థులు, స్వాములు ఆశ్రమ ప్రతిష్ఠను దిగజార్చే విధంగా దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఆశ్రమ ట్రస్టు మాజీ కోశాధికారి మన్నెం అమరనాథరెడ్డి పూర్వీకుల ఇంట్లో ఆశ్రమ ప్రథమ పీఠాధిపతి విమలానంద గిరి స్వామి, ద్వితీయ పీఠాధిపతి విద్యానంద గిరి స్వామి ఉండి వేద విద్య నేర్చుకున్నారని అన్నారు. ఆశ్రమంతో వారికి ఉన్న అనుబంధతోనే ఆశ్రమ ద్వితీయ పీఠాధిపతి విద్యానంద గిరి స్వామి అమరనాథ రెడ్డిని నియమించారన్నారు. మీడియా ప్రతినిధులు ఆశ్రమ ఆస్తుల విక్రయాలు, పూర్వ విద్యార్థులు, ఆశ్రమ పరిరక్షణ సమితి సభ్యులు చేస్తున్న ఆరోపణలకు వివరణ ఇవ్వాలని కోరగా కొన్ని అభియోగాలకు సమాధానాలు చెప్పలేక తటపటాయించారు. సమావేశంలో శివ రాం స్వామి, మన్నెం అమరనాథరెడ్డి పాల్గొన్నారు.


