శ్రీకాళహస్తి/తొట్టంబేడు: మట్కా నిర్వహణ, అక్రమ మద్యం రవాణా కేసులో ఇద్దరు నిందితులను తొట్టంబేడు పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఎస్ఐ బాలకృష్ణ వివరాలు వెల్లడించారు. శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన షేక్ ఖాదర్ షరీఫ్ అలియాస్ లడ్డు, ఎస్.కె.మీర్జా మట్కా బుకీలుగా వ్యవహరిస్తూ వచ్చిన డబ్బును ప్రధాన నిర్వాహకులైన అమాన్ అలియాస్ అమానుల్లా, పద్మనాభంకు అందజేయడంతో పాటు అక్రమ మద్యం రవాణాలోనూ పాలు పంచుకున్నట్లు విచారణలో వెల్లడైంది. వీరిపై గతంలో శ్రీకాళహస్తి వన్టౌన్, టూ టౌన్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. అనంతరం నిందితులను న్యాయస్థానం ఎదుట హాజరుపరచగా న్యాయమూర్తి ఇద్దరికీ 14 రోజుల రిమాండ్ విధించారు. మట్కా, అక్రమ మద్యం విక్రయాలపై 9440900724, 9440796763 నంబర్లకు సమాచారం అందించాలని పోలీసులు కోరారు.


