
ప్రాణం తీసిన ఈత సరదా
● బావిలో దూకి విద్యార్థి మృతి
చంద్రగిరి: సరదగా ఈత కో ట్టేందుకు బావిలోకి దూకిన విద్యార్థి మృతి చెందిన ఘటన చంద్రగిరిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. మండల పరిధిలోని బుచ్చినాయుడుపల్లి పంచాయతీ, శంకయ్యగారిపల్లికి చెందిన నూర్జాన్ భర్త చనిపోవడంతో కుమారుడు బషీర్(15)తో కలసి చంద్రగిరి కొత్తపేటలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటోంది. కుమారుడు బషీర్ స్థానిక పాలిటెక్నిక్ కళాశాలల మొదటి సంవత్సరం చదువుతున్నాడు. సోమవారం బషీర్తో పాటు మరో నలుగురు స్నేహితులు చంద్రగిరి దిగువ వీధిలోని బావిలో ఈత కొట్టేందుకు వెళ్లారు. ఈ క్రమంలో ఈత కొట్టేందుకు బావిలోకి దూకినట్లు బషీర్ ఎంతకీ పైకి రాకపోవడంతో స్నేహితులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో సుమారు రెండు గంటల పాటు గల్లంతైన యువకుడి కోసం గాలించారు. ఆపై ఏ.రంగంపేటకు చెందిన ఎంపీటీసీ బోసు రెడ్డికి సమాచారం అందించారు. అనంతరం ఆయన గజ ఈతగాళ్లైన నరేష్, పురుషోత్తంతో కలసి పాతాళభైరవి సాయంతో బావిలో మునిగిపోయిన విద్యార్థి మృతదేహాన్ని బయటకు తీశారు. ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడంతో తల్లి నూర్జాన్తో పాటు బంధువులు బోరున విలపించారు. అనంతరం మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.