
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం వరి రైతుకు షాక్ ఇస్తూ.. ఇతర పంటలు సాగు చేసే రైతులకు బాసటగా నిలిచింది. వరి ధాన్యానికి మినహా ఇతర అన్ని ప్రధాన పంటలకు ఎమ్మెస్పీ భారీగా పెంచింది. దీంతో రైతులు ఆయా ఇతర పంటలకు మారే అవకాశం ఉందని వ్యవసాయ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. భారీగా పెరిగిన మద్దతు ధర నేపథ్యంలో ఈసారి పత్తి సాగు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.
పెరిగిన నీటి వనరులతో కరీంనగర్, నిజామాబాద్, మెదక్ , నల్లగొండ జిల్లాల్లో గతంలో పత్తి సాగు చేసిన రైతులు కూడా వరికి మారిపోగా, ఎంఎస్పీ పెంపుతో మరింత అధికంగా పత్తి వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని వ్యవసాయ శాఖలోని ఓ కీలక అధికారి ‘సాక్షి’కి చెప్పారు. అలాగే మద్దతు ధర బాగా పెరిగిన ఇతర పంటల సాగు కూడా పెరిగే చాన్స్ ఉందని అన్నారు.
వరికి రూ.69తోనే సరి
2025–26 మార్కెటింగ్ సీజన్లో వానాకాలం (ఖరీఫ్) సీజన్కు సంబంధించి పలు కీలక పంటల ఎమ్మెస్పీ పెంచుతూ బుధవారం కేంద్ర కేబినెట్నిర్ణయం తీసుకుంది. వరి మద్దతు ధరను కేవలం రూ.69 పెంచిన కేంద్రం, పత్తి ఎమ్మెస్పీని ఏకంగా రూ.589 పెంచింది. తాజా పెంపుతో క్వింటాల్ ఏ–గ్రేడ్ వరి ధాన్యం మద్దతు ధర రూ.2,320 నుంచి రూ.2,389కి పెరిగింది.
దేశంలోనే వరిసాగులో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. ప్రస్తుత యాసంగి సీజన్లో ఇప్పటివరకు 64 ఎల్ఎంటీల ధాన్యాన్ని రైతులు విక్రయించారు. ఎకరం పొలంలో 25 క్వింటాళ్ల వరి ధాన్యం దిగుబడి వస్తుందనుకుంటే.. పెరిగిన మద్ధతు ధరతో ఎకరం భూమిలో పంట వేసిన రైతుకు రూ.1,725 అదనంగా సమకూరనుంది.
ఇక ఇప్పటివరకు క్వింటాల్కు రూ.7,521గా ఉన్న పొడుగు (లాంగ్ స్టేపిల్–పొడుగు పింజ) పత్తి ఎమ్మెస్పీ రూ.589 పెంపుతో రూ.8,110కి చేరింది. మీడియం స్టేపిల్ ధర రూ.7,121 నుంచి రూ.7,710కి చేరింది. రాష్ట్రంలో గత వానాకాలం సీజన్లో 43 లక్షల ఎకరాల్లో పత్తి సాగవగా, సుమారు 28 ఎల్ఎంటీల దిగుబడి వచి్చంది. ఈసారి 50 లక్షల ఎకరాల్లో సాగుకు ప్రణాళిక సిద్ధం చేయగా..తాజాగా పెరిగిన ఎమ్మెస్పీతో ఈసారి పత్తి సాగు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.
తృణ ధాన్యాలు, నూనె గింజెలకు కూడా..
పత్తితో పాటు నూనె గింజెలు, పప్పులు, తృణ ధాన్యాలకు మద్దతు ధరను కూడా కేంద్రం భారీగా పెంచింది. ముఖ్యంగా నైజర్ సీడ్ (వెర్రి నువ్వులు) క్వింటాల్కు రూ.820, రాగి రూ.596, నువ్వులు రూ.579, వేరుశనగ రూ.480 చొప్పున పెంచింది. ఆదిలాబాద్ జిల్లాలో అధికంగా సాగయ్యే సోయాబీన్కు రూ.436 పెంచింది. అలాగే మొక్కజొన్న రూ.328, పొద్దుతిరుగుడు రూ.441, పప్పు ధాన్యాలలో కందిపప్పు రూ.450, పెసరపప్పు రూ.86, మినపపప్పు రూ.400 పెంచింది.
వరి సాగు తగ్గింపే లక్ష్యమా?
పప్పు ధాన్యాలు, నూనె గింజలు, పోషక తృణధాన్యాలను కాకుండా ఇతర పంటల సాగును బాగా ప్రోత్సహిస్తున్నామని, ఆ పంటలకు అధిక ఎమ్మెస్పీని అందిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం తన ప్రకటనలో పేర్కొంది. వరి సాగును తగ్గించి ఇతర పంటలను పెంచాలని కేంద్రం భావిస్తున్నట్టు దీన్నిబట్టి అర్థమవుతోంది. కేంద్రం నిర్ణయంతో రాష్ట్రంలో మొక్కజొన్న, కంది, మినుము, రాగులు, జొన్న, వేరుశనగ, సోయాబీన్, నువ్వుల పంటలతో పాటు తృణధాన్యాల పంటలకు ఈసారి డిమాండ్ రావచ్చని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది.