వీబీజీ రామ్–జీ కింద రూ.1 రోజు కూలీ పెంపుదల
సాక్షి, హైదరాబాద్: కొత్తగా అమల్లోకి రానున్న వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్–గ్రామీణ్ (వీబీ జీ రామ్–జీ) పథకం కింద తెలంగాణకు సంబంధించి కూలీ రేటు ఒక్క రూపాయి మాత్రమే పెరిగింది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కూలీ రేటును రూ.308 (గతంలో రూ.307) పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో రోజువారీ కూలీరేటును రూ.312గా (గతంలో రూ.307–ఐదు రూపాయలు పెంపుదల) నిర్ణయించింది.
జూలై 1 (బుధవారం) నుంచి ఈ రేట్లు అమల్లోకి రానున్నట్టుగా కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ ప్రకటించింది. రాష్ట్రంలో ఈ పథకం అమలుకు గురువారం ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ చట్టాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అభ్యంతరాలున్నా, తప్పని పరిస్థితుల్లో దాని అమలుకు అంగీకరించాల్సి వస్తోంది.
దీనిపై గురువారం జరిగే కేబినెట్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. నిధుల భారం 60:40 (కేంద్రం:రాష్ట్రం) నిష్పత్తిలో ఉండటం వల్ల రాష్ట్రానికి ఏటా దాదాపు రూ.2 వేల కోట్ల అదనపు భారం పడుతుందని అంచనా వేస్తున్నారు. గురువారం కేబినెట్ భేటీ అనంతరం జరిగే కేబినెట్ సబ్కమిటీ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ అభ్యంతరాలపై అనుసరించే వైఖరిపై నిర్ణయం తీసుకోనున్నారు.


