
వెయ్యి నుంచి 2,300 ఏళ్ల నాటివని అనుమానం
వనపర్తి టౌన్: చైతన్య, వివేకాపర్తిగా పేరున్న వనపర్తిలో క్రీస్తు పూర్వం నాటి వీరగల్లు యుద్ధ ఆనవాళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. యుద్ధంలో వీరుల మరణాలను స్మరించుకునే వీరగల్లు శిలలు వనపర్తి జిల్లా కేంద్రంలో వెలుగుచూశాయి. పట్టణంలోని పోచమ్మగుడి వద్ద శతాబ్దాల నాటి వీరగల్లు స్మారక శిలలను చరిత్ర పరిశోధకులు, చరిత్రకారులు బైరోజు చంద్రశేఖర్, డాక్టర్ శ్యాంసుందర్ గుర్తించారు. ఈ వీర శిలలలో తొమ్మిది మంది వీరుల్లో ఒక అశ్వారూఢుడైన వీరుడు బల్లెంతో, మరొక వీరుడు బల్లెం, డాలుతో కనిపిస్తున్నాయి.
కొన్ని దశాబ్దాల కిందట కర్ణాటక, తెలంగాణలోని సిద్దిపేట, వనపర్తి, వికారాబాద్లో వీరగల్లుల ఆనవాళ్లు ఉన్నట్లు ప్రముఖ ఆంగ్ల పత్రికల్లో వార్తలు వచ్చాయి. వీరగల్లు శిలలు కొన్నేళ్ల తరబడి వనపర్తిలోని పోచమ్మ ఆలయంలో ఉన్నప్పటికీ వాటిని ఎవరూ గుర్తించలేపోయారు. ఈ క్రమంలోనే వనపర్తిలోని చిట్యాల రోడ్డులో వీరులగడ్డ అనే పేరుతో ఒక ప్రాంతం ఉండటంతో ఆ పేరు ఎలా వచ్చిందని పరిశోధకులు పరిశీలిస్తుండగా, వనపర్తి పోచమ్మ ఆలయంలో ఉన్న శిలలు వీరగల్లు విగ్రహాలని తేలింది.
150– 300 ఏళ్ల కిందట వీరుల స్మారక శిలలను వనపర్తిలోని పోచమ్మ ఆలయంలో భద్రపరిచినట్లు తెలుస్తోంది. ఇన్ని రోజులు ఈ వీరగల్లు శిలలను స్థానిక ప్రజలు దేవతామూర్తులుగా భావించారు. ఈ వీరశిలలలో సతి శిలలు నాలుగు, కత్తి ఆయుధంగా ధరించిన ఎక్కటీలు ఇద్దరు ఉన్నారు.
వనపర్తి చరిత్ర శతాబ్దాల కిందటిదే..
వీరుల స్మారక శిలలు ఒకేచోట లభించడంతో వందలు, వేల సంవత్సరాల కిందటే వనపర్తి ఒకనాటి యుద్ధరంగమై ఉంటుందని చరిత్రకారులు, పరిశోధకులు భావిస్తున్నారు. వీరగల్లు శిలలు క్రీస్తు పూర్వం నుంచి ఉన్నాయని, వీరగల్లులలో దాదాపు 40 రకాలున్నాయని, శాసనంతో కూడిన వీరగల్లులు వాటిలో ప్రత్యేకమని కొత్త తెలంగాణ చరిత్ర బృంద కన్వినర్ శ్రీరామోజు హరగోపాల్ తెలిపారు. వనపర్తికి అతి సమీపంలో ఉండే నాచహళ్లి గ్రామంలో గోపాల్ వ్యవసాయ పొలంలో కూడా శాసనంతో కూడిన గుడిలాంటి ప్రాంతంలో ఒక సతి శిల, ఒక వీరశిల ఉన్నట్లు గుర్తించామన్నారు.