గతంలో అమల్లో ఉన్న మార్గదర్శకాల ప్రకారమే కొత్త పింఛన్లు
గతంలో అన్ని పత్రాలు సమర్పిస్తే మళ్లీ దరఖాస్తు అవసరం లేదు
సాక్షి, హైదరాబాద్ : కొత్త చేయూత పింఛన్ల కోసం దరఖాస్తులను ఈ నెల 31 వరకు స్వీకరించనున్నారు. ఈ దరఖాస్తులతోపాటు వివరాలను చేయూత పోర్టల్లో నమోదు చేసే ప్రక్రియను కూడా వెనువెంటనే చేపట్టనున్నారు. దరఖాస్తుల పరిశీలనకు సంబంధించిన ‘టైమ్లైన్స్’, జాబితాల ఖరారు, ‘శాంక్షన్ ప్రొసీడింగ్స్’పంపిణీ వంటి వాటికి సంబంధించిన సూచనలు, ఆదేశాలు విడిగా పింఛన్ లబ్ధిదారులకు పంపించనున్నారు. ఈ మేరకు ఆయా అధికారులకు గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ (సెర్ప్) సీఈవో, మెప్మా ఇన్చార్జ్ దివ్యదేవరాజన్ ఓ సర్క్యులర్ ద్వారా తెలియజేశారు. గతంలో ఉన్న అర్హత నిబంధనలనే కొనసాగిస్తూ, అర్హులైన వారికి సామాజిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రక్రియను వేగవంతం చేశారు.
» ప్రజాపాలన వారోత్సవాలు, 99 రోజుల ప్రగతి ప్రణాళిక గ్రామ సభలు, ప్రజావాణిలో పింఛన్ల కోసం ఇప్పటికే అందిన దరఖాస్తులను కూడా పరిగణనలోకి తీసుకుంటారు
» గతంలో దరఖాస్తు చేసి, అవసరమైన అన్ని పత్రాలు సమర్పించిన వారు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు
» అవసరమైన పత్రాలు సమర్పించని వారు లేదా ఇప్పటి వరకు దరఖాస్తు చేయని అర్హులు కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చు
» అర్హత నిర్ధారణకు సంబంధిత శాఖల నుంచి అవసరమైన ధ్రువపత్రాలను పొందేలా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకుంటారు
» వితంతువులకు భర్త మరణ ధ్రువపత్రం, ఒంటరి మహిళలకు సెపరేషన్ లేదా స్థానిక విచారణ నివేదిక, గీత కార్మికులకు ఎక్సైజ్ శాఖ ధ్రువీకరణ
» చేనేత కార్మికులకు చేనేత–జౌళి శాఖ ధ్రువీకరణ, పైలేరియా బాధితులకు వైద్య ఆరోగ్య శాఖ ధ్రువీకరణ అవసరం.
» దరఖాస్తుల పరిశీలన అనంతరం నిర్దేశిత అధికారులు క్షేత్రస్థాయిలో అర్హతను తనిఖీ చేస్తారు
» ఆ తర్వాత అర్హుల జాబితాను జిల్లా స్థాయికి పంపి, జిల్లా కలెక్టర్ ఆమోదంతో పింఛన్ మంజూరు ప్రక్రియ పూర్తి చేస్తారు
» ప్రతి అర్హుడికి చేయూత అందించాలనే ఉద్దేశంతో స్వయం సహాయక సంఘాల సమాఖ్యలకు కూడా బాధ్యతలు అప్పగించారు


