విలేజి టెక్నాలజీ | Uddamarri Village Technology Develop: Cooking gas through pipeline to house | Sakshi
Sakshi News home page

విలేజి టెక్నాలజీ

Jul 13 2024 5:17 AM | Updated on Jul 13 2024 5:17 AM

Uddamarri Village Technology Develop: Cooking gas through pipeline to house

ఫిల్టర్‌ వాటర్‌ కావాలంటే స్మార్ట్‌ కార్డు రెడీ..24 గంటలూ మంచి నీళ్లు అందుబాటులో ఉంటాయి..

పైప్‌లైన్‌ గ్యాస్‌ కనెక్షన్‌తో నేరుగా ఇంటికి వంటగ్యాస్‌ వస్తుంటుంది.. వాడుకున్న గ్యాస్‌కు నెలనెలా బిల్లు కడితే సరి..

ఏ ఇన్ఫర్మేషన్‌ అయినా ఇంటింటికీ వినిపించేలా ఏర్పాటు చేసిన మైక్‌లో చెప్పేస్తుంటారు..

.. ఇదంతా ఏదో అభివృద్ధి చెందిన దేశంలో జరుగుతున్నది కాదు.మన గ్రేటర్‌ హైదరాబాద్‌ శివార్లలోని డుచింతలపల్లి మండలంలో ఉన్న గ్రామాల్లోని ‘హైటెక్‌’ సౌకర్యాలివి..

గ్రేటర్‌ సిటీ శివార్లలోని మూడు గ్రామాల్లో అత్యాధునిక సదుపాయాలు 

టెక్నాలజీ వాడకంలో ముందున్న ఉద్దమర్రి, కొల్తూర్, పోతారం.. 

స్మార్ట్‌ కార్డులతో 24 గంటలూ అందుబాటులో ఫిల్టర్‌ వాటర్‌  

ఇంటింటికీ పైప్‌లైన్‌ ద్వారా వంటగ్యాస్‌ సరఫరా.. నెలనెలా బిల్లు కడితే సరి 

ఏ సమాచారమైనా క్షణాల్లో ఊరంతా తెలిసేలా సౌండ్‌ సిస్టమ్‌

రాజీగళ్ల భూపాల్‌..మూడుచింతలపల్లి మండలంలోని పోతారం, కొల్తూర్‌ గ్రామాల్లో గేటెడ్‌ కమ్యూనిటీలకు దీటుగా పైప్‌లైన్‌ ద్వారా వంట గ్యాస్‌ సరఫరా జరుగుతోంది. ఇక్కడికి సమీపంలోని జీనోమ్‌ వ్యాలీలో ఉన్న ఫార్మా కంపెనీలకు ఎల్పీజీ గ్యాస్‌ సరఫరా చేసేందుకు మెగా గ్యాస్‌ కంపెనీ పోతారంలో సబ్‌స్టేషన్‌ (కంప్రెసర్‌) ఏర్పాటు చేసింది. తమ గ్రామంలో సబ్‌స్టేషన్‌ పెట్టిన నేపథ్యంలో.. ఇక్కడి ఇళ్లకు పైప్‌లైన్‌ ద్వారా వంటగ్యాస్‌ సరఫరా చేయాలని గ్రామస్తులు కోరడంతో ఆ ఏర్పాట్లు చేసింది. వినియోగదారులు రూ.6 వేలు చెల్లిస్తే.. వారి ఇంటికి వంటగ్యాస్‌ పైప్‌లైన్‌ కనెక్షన్‌ ఇస్తారు. దానికి ఒక మీటర్‌ను అమర్చుతారు. ప్రతి నెలా కంపెనీ సిబ్బంది వచ్చి మీటర్‌ వద్ద స్కాన్‌ చేసి.. వినియోగించిన గ్యాస్‌కు సంబంధించిన బిల్లు ఇస్తారు. అచ్చు కరెంటు బిల్లు తరహాలో నెలనెలా బిల్లు కట్టేస్తే సరిపోతుంది.

సిలిండర్ల కోసం ఇబ్బంది తప్పింది 
పైప్‌లైన్‌ ద్వారా వంటగ్యాస్‌ సరఫరా చేయడం గ్రామస్తులకు ఉపయోగకరంగా ఉంది. గతంలో సిలిండర్‌ అయిపోతే రెండు, మూడు రోజుల వరకు ఇబ్బంది ఎదుర్కోవాల్సి వచ్చేది. దానికితోడు గ్యాస్‌ సిలిండర్లు ఇచి్చనప్పుడు డెలివరీ చార్జ్‌లు, సరీ్వస్‌ చార్జ్‌లు అంటూ అదనంగా డబ్బులు తీసుకునేవారు. ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా.. నిరంతరాయంగా వంట గ్యాస్‌ సరఫరా అవుతోంది. వాడుకున్న మేర బిల్లు చెల్లిస్తే సరిపోతోంది. – హరిమోహన్‌రెడ్డి, పోతారం మాజీ సర్పంచ్‌  

ఉద్దమర్రి గ్రామంలో స్మార్ట్‌ కార్డులు
మూడుచింతలపల్లి మండలం ఉద్దమర్రిలోని వాటర్‌ ఫిల్టర్‌ కేంద్రం (సామాజిక నీటి శుద్ధి కేంద్రం)లో సిబ్బంది లేకుండానే ప్రజలు నీటిని కొని తీసుకెళ్లేలా ఏర్పాటు చేశారు. తాజా మాజీ సర్పంచ్‌ యాంజాల అనురాధ పట్టభద్రురాలు కావడం, డిజిటల్‌ విధానంపై అవగాహన ఉండటంతో.. స్మార్ట్‌కార్డు విధానం ఏర్పాటుకు నిర్ణయించారు. దీనిపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు.

ఈ వాటర్‌ ఫిల్టర్‌ నిర్వాహకులకు ముందుగా రూ.50 చెల్లిస్తే ఒక 20 లీటర్ల వాటర్‌ క్యాన్‌తోపాటు యాక్టివేట్‌ చేసిన స్మార్ట్‌ కార్డును వినియోగదారులకు ఇస్తారు. తర్వాత వినియోగదారులు నగదు ఇచ్చి స్మార్ట్‌ కార్డును రీచార్జ్‌ చేసుకోవచ్చు. వాటర్‌ ప్లాంట్‌ వద్ద ఉన్న మిషన్‌ సెన్సర్‌ వద్ద స్మార్ట్‌ కార్డును స్కాన్‌ చేస్తే కార్డులో నుంచి రూ.5 కట్‌ అయి.. వారు నాజిల్‌ దగ్గర పెట్టిన వాటర్‌ క్యాన్‌ నిండుతుంది. ఇలా స్మార్ట్‌కార్డు వినియోగించిన ప్రతిసారీ రూ.5 చొప్పున కట్‌ అయి.. వాటర్‌ బాటిల్‌ నిండుతుంది. ఫిల్టర్‌ వాటర్‌ కేంద్రం 24 గంటలూ ఆన్‌లో ఉంటుంది. ఎప్పుడు కావాలన్నా వెళ్లి నీళ్లు తెచ్చుకోవచ్చు.

కావాల్సినప్పుడల్లా తెచ్చుకుంటున్నాం.. 
స్మార్ట్‌ కార్డ్‌తో మంచి ప్రయోజనం ఉంది. రోజూ నీళ్లు తెచ్చుకోవాలంటే చేతిలో డబ్బులు, చిల్లర ఉండకపోవచ్చు. నెల మొదటి వారంలో డబ్బు ఉన్నపుడు రీచార్జి చేయించుకుంటే చాలు. ఈ కేంద్రం 24 గంటలూ అందుబాటులో ఉంటోంది. అవసరమైనప్పుడల్లా నీటిని తెచ్చుకుంటున్నాం. –జూపల్లి పద్మ, ఉద్దమర్రి   

Advertisement
 
Advertisement
Advertisement