
వృద్ధురాలి ఆభరణాల చోరీ కేసులో నిందితుల అరెస్ట్
వివరాలు వెల్లడించిన తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్
మనోహరాబాద్(తూప్రాన్): వృద్ధురాలికి మాయమాటలు చెప్పి బైక్పై ఎక్కించుకుని ఆభరణాలతో ఉడాయించిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం మనోహరాబాద్ పోలీస్స్టేషన్లో విలేకరుల సమావేశంలో తూప్రాన్ డీఎస్పీ నరేందర్గౌడ్ వివరాలు వెల్లడించారు. తూప్రాన్ మండలం కొప్పులపల్లి గ్రామానికి చెందిన బాదనపురం పెంటయ్య(30) మండలంలోని వట్టూర్ గ్రామానికి చెందిన వరలక్ష్మి(30)తో సహజీవనం చేస్తున్నాడు. కాగా నిందితుడికి భార్యాపిల్లలు ఉన్నారు. నిందితుడు ఆన్లైన్ గేమ్స్కు బానిసై ఈ క్రమంలో లోన్లు సైతం తీసుకున్నాడు. అప్పులు ఎక్కువ అవ్వడంతో తీర్చేందుకు చోరీలు చేస్తున్నాడు.
గత సంవత్సరం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఓ పల్సర్ బైక్ను చోరీ చేసి ఆంధ్రాకు చెందిన నంబర్ ప్లేట్ అమర్చాడు.ఈ నెల 7న సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన మన్నె రామవ్వ పాములపర్తికి వెళ్లేందుకు గజ్వేల్ బస్టాండులో ఉంది. నిందితులు వరలక్ష్మి వృద్ధురాలికి మాయమాటలు చెప్పి పెంటయ్యతో కలిసి బైక్ౖపై తీసుకొని పర్కిబండ సమీపంలోని ఓ గుడిలోకి వెళ్లి మద్యం తాగారు. కాగా వృద్ధురాలు మత్తులోకి జారుకోగానే ఆమె ఒంటిపై ఉన్న తులం బంగారు నల్లపూసల తాడు, చెవికమ్మలు, 50 తులాల వెండి కడియాలు చోరీ చేశారు. వృద్ధురాలు అరవగా చంపుతామని బెదిరించి పరారయ్యారు.
వెంటనే వృద్ధురాలు మనోహరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్పీ ఆదేశాల మేరకు తూప్రాన్ సీఐ రంగాకృష్ణ, ఎస్ఐ సుభాష్గౌడ్ దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం దండుపల్లి వద్ద వాహనాల తనిఖీలో నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కేసును ఛేదించిన సీఐ, ఎస్ఐ, సిబ్బంది గోవర్ధన్రావు, రాధాకృష్ణ, భిక్షపతిలను ఎస్పీ అభినందించినట్లు తెలిపారు. అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, అనుమానితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ పేర్కొన్నారు.