సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీజేపీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎంపీ లక్ష్మణ్ ఇంటికి బండి సంజయ్, ఈటల రాజేందర్ వెళ్లారు. ఈటల, బండి సంజయ్ మధ్య సయోధ్య దిశగా చర్చలు సాగుతున్నట్లు సమాచారం. పార్టీ అంతర్గత విభేదాలపై ఇప్పటికే హైకమాండ్కు నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే. నేతల విభేదాలకు చెక్ పెట్టాలని బీజేపీ హైకమాండ్ నిర్ణయించింది.
కాగా, కమలదళానికి కాయకల్ప చికిత్స సిద్ధమైంది. బీజేపీ ప్రధాన రాజకీయ లక్ష్యమైన అధికార సాధన అనే కీలక ఘట్టానికి చేరడంలో రాష్ట్రపార్టీ ఎదుర్కొంటున్న బలహీనతలు, ఇబ్బందులను జాతీయ అధినాయకత్వం గుర్తించింది. రాష్ట్ర పార్టీలోని ముఖ్య నేతల ఈగోలు, సమన్వయలేమి అనేవి ప్రధాన సమస్యలుగా మారాయని గుర్తించి ‘కీలెరిగి వాత’పెట్టేందుకు సమాయత్తమైనట్లుగా బీజేపీలోని అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ద్వారా తెలుస్తోంది.
దశాబ్దాలుగా తెలంగాణలో బీజేపీకి గుర్తింపు ఉన్నా.. గత 10–15 ఏళ్లుగా పూర్తిస్థాయిలో రాజకీయంగా పుంజుకునే అవకాశాలున్నా వాటిని వినియోగించుకోకపోవడంపై జాతీయనాయకత్వం దృష్టి పెట్టినట్టు సమాచారం. తెలంగాణలో బీజేపీ పూర్తిస్థాయిలో పుంజుకుని, అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్లకు ఏకైక ప్రత్యామ్నాయంగా ఎదగకపోవడానికి ముఖ్యనేతలంతా ‘ఎవరికి వారే యమునాతీరే’అన్నట్టుగా వ్యవహరిస్తుండడం ముఖ్యమైన సమస్యగా పరిణమించిందని వారు అభిప్రాయపడినట్లు తెలిసింది. పార్టీ బలంగా ఉన్న ఉత్తర తెలంగాణ జిల్లాల్లో (3 ఎంపీలు, 7 ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు గెలుపు) ముఖ్యనేతల మధ్య గ్రూపుల సమస్య తీవ్రస్థాయికి చేరినట్లుగా వారు అంచనా వేసినట్లు సమాచారం.
ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో గ్రూపు రాజకీయాల కుంపట్లు తీవ్రస్థాయికి చేరుకోవడంతో ఇక వాటికి చెక్ పెట్టాల్సిన రోజులు దగ్గరపడ్డాయని అగ్రనేతలు గుర్తించినట్లు సమాచారం. ఏళ్ల తరబడి పార్టీ జెండా మోసిన సీనియర్ నేతలకు, కొన్నేళ్ల క్రితం చేరిన వలస నేతలకు మధ్య తీవ్రస్థాయిలో నడుస్తున్న కోల్డ్ వార్కు సైతం చరమగీతం పాడాలని నిర్ణయించినట్టు సమాచారం.


