శంషాబాద్: బహదూర్గూడలో మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భూసేకరణకు వ్యతిరేకంగా రైతులు ఆందోళనకు దిగారు. పోలీసులపై ఆందోళనకారులు కారం చల్లారు. రాళ్లు, కుర్చీలతో పోలీసులపై దాడి చేశారు.
డీసీపీ యోగేశ్ గౌతమ్తో పాటు పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. బుల్లెట్ట్రైన్ కోసం భూములు సేకరిస్తోంది ప్రభుత్వం. అయితే, భూములు ఇచ్చే ప్రసక్తే లేదని రైతులు అంటున్నారు. రైతులకు మద్దతు ఇస్తున్న బీజేపీ నాయకులకు అరెస్టు చేసి, అక్కడి నుంచి పోలీసులు తరలించారు.
రైతులు సహనంతో ఉండాలని డీసీపీ యోగేశ్ గౌతమ్ కోరారు. చర్చలు అయిపోయాయని, మాట్లాడేదేమీ లేదని చెప్పారు. రైతుల డిమాండ్లు అన్నీ ప్రభుత్వం దృష్టికి వెళ్లాయని తెలిపారు. రైతులు ఆందోళనను విరమించాలని కోరారు.
కాగా, గత కొన్ని రోజులుగా రైతులు నిరసన తెలుపుతున్నారు. తమకు ప్రభుత్వం సరైన హామీలు ఇవ్వకుండా భూములు తీసుకోవద్దని అంటున్నారు. అన్ని అంశాలపై స్పష్టత కావాలని డిమాండ్ చేస్తున్నారు. తమ సమస్యలను పరిష్కరించకుండా బలవంతంగా భూములు తీసుకునేందుకు యత్నిస్తున్నారని రైతులు ఆరోపణలు చేస్తున్నారు.


