ఔటర్పై లారీని ఢీకొన్న కారు..
సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి
రోడ్డు ప్రమాదంలో నుజ్జునుజ్జు అయిన కారు
మనోహర్ (ఫైల్)
హైదరాబాద్, శంషాబాద్: ఔటర్పై జరిగిన రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి చెందగా వదినకు తీవ్ర గాయాలయ్యాయి. శంషాబాద్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కె.నరేందర్రెడ్డి తెలిపిన మేరకు.. కాకినాడ రామచంద్రాపురం మండలం యెరుపల్లికి చెందిన చల్లా రాఘవేంద్ర ప్రసాద్ ప్రైవేటు ఉద్యోగం చేస్తూ కిస్మత్పూర్లో నివాసముంటున్నాడు.
వరుసకు సోదరుడైన చల్లా మనోహర్ (25) సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటూ ఇక్కడే ఉంటున్నాడు. రాఘవేంద్రప్రసాద్ సోదరి నిశ్చితార్థం కోసం వారి స్వగ్రామం యెరుపల్లికి ఈ నెల 4న ప్రసాద్, అతని భార్య భవాని (31), కొడుకు కార్తికేయ (2)తో పాటు మనోహర్ వెళ్లాడు. శుభకార్యం తర్వాత వీరంతా ఈ నెల 5న సాయంత్రం హైదరాబాద్ బయలుదేరారు.
వెనక నుంచి లారీని ఢీకొట్టి..
కారును రాఘవేంద్రప్రసాద్ నడుపుతుండగా.. పక్క సీట్లో మనోహర్, వెనక సీట్లో భవాని, కార్తికేయ కూర్చున్నారు. సోమవారం తెల్లవారుజామున వీరు ఔటర్పై పెద్దగోల్కొండ శివారులోకి రాగానే.. ముందు వెళ్తున్న లారీ డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేశాడు. రాఘవేంద్ర గమనించకపోవడంతో కారు అదుపుతప్పి వెనక నుంచి ఢీకొట్టింది.
లారీని కారు ఎడమవైపు భాగం బలంగా ఢీకొనడంతో మనోహర్కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కారు వెనక సీట్లో కూర్చున్న భవానికి తీవ్ర గాయాలవడంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమాచారం అందుకున్న శంషాబాద్ పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


