సాక్షి, రంగారెడ్డి: శంషాబాద్ మండలం బహదూర్గూడలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. బుల్లెట్ ట్రైన్ హబ్కు వ్యతిరేకంగా రైతులు ఆందోళన ఓవైపు.. ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకునేందుకు హైడ్రా చేస్తున్న ప్రయత్నం మరోవైపు ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో వెయ్యి మందికి పైగా పోలీస్ సిబ్బంది మోహరించారు.
గత ఐదు రోజులుగా భూముల అంశంపై రైతులు నిరసనలు కొనసాగిస్తున్నారు. వారసత్వంగా తాము సాగు చేసుకుంటున్నామని.. తమకు సరైన హామీలు ఇవ్వకుండా భూములు తీసుకోవద్దని వారు డిమాండ్ చేస్తున్నారు. పరిహారం, పునరావాసం, భవిష్యత్ భద్రతపై స్పష్టత వచ్చిన తర్వాతే భూముల స్వాధీన ప్రక్రియ చేపట్టాలని రైతులు పట్టుబడుతున్నారు.

భారీగా పోలీసుల మోహరింపు
అధికారులు మాత్రం ఈ భూములు ప్రభుత్వానికి చెందినవని, ప్రాజెక్టు అవసరాల కోసం వాటిని స్వాధీనం చేసుకుంటున్నామని చెబుతున్నారు. నిబంధనల ప్రకారమే ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొంటున్నారు. భూముల స్వాధీన చర్యల్లో భాగంగా హైడ్రా అధికారులు బహదూర్గూడకు చేరుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. సర్వే నెంబర్ 68తో పాటు మరో చోట అక్రమ కట్టాల్ని తొలగిస్తూ.. ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో.. బయటకు వాళ్లను అనుమతి లేదంటూ బోర్డులు పాతారు.
మాకు పట్టాలు ఉన్నాయి..
మరోవైపు కొందరు రైతులు మాత్రం తమకు ఈ భూములపై హక్కులు ఉన్నాయని చెబుతున్నారు. తమ వద్ద భూములకు సంబంధించిన పట్టాలు ఉన్నాయని, ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటూ జీవిస్తున్నామని వారు అంటున్నారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించకుండా బలవంతంగా భూములు తీసుకునే ప్రయత్నం చేస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు. ముందుగా తమతో చర్చలు జరిపి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

రైతులకు బీఆర్ఎస్ మద్దతు
బహదూర్గూడ రైతుల ఆందోళనకు బీఆర్ఎస్ మద్దతు ప్రకటించింది. రైతులకు న్యాయం చేయకుండా భూములు తీసుకోవడం సరికాదని ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు. రైతుల హక్కులను కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో రైతులకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన బీఆర్ఎస్ నేత పటోళ్ల కార్తీక్రెడ్డిని అరెస్ట్ చేసి పీఎస్కు తరలించి.. ఆపై వదిలేసినట్లు తెలుస్తోంది.
బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టే కారణం
బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు అవసరమైన భూముల సేకరణలో భాగంగానే ఈ వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది. అభివృద్ధి ప్రాజెక్టులకు తాము వ్యతిరేకం కాదని, అయితే తమ హక్కులు, ప్రయోజనాలకు రక్షణ కల్పించిన తర్వాతే భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని రైతులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం గ్రామంలో అధికారులు, పోలీసులు, రైతుల మధ్య పరిస్థితి సున్నితంగా మారింది.


