సాక్షి, శంషాబాద్: హైదరాబాద్ శివారులోని శంషాబాద్ ప్రాంతంలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపు తప్పిన ఓ బొలెరో వాహనం బస్టాండ్లో వేచి ఉన్న మహిళలపైకి దూసుకెళ్లడంతో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరికి గాయాలయ్యాయి. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.
సతమరాయి సమీపంలో ఈ వేకువజామున ఈ ఘోరం జరిగింది. ఉదయం సమయంలో రోడ్డుపై వెళ్తున్న బొలెరో.. ముందు వెళ్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో అదుపు తప్పినట్లు తెలుస్తోంది. వేగంగా వచ్చిన వాహనం నేరుగా రోడ్డు పక్కన ఉన్న బస్టాండ్లోకి దూసుకెళ్లింది. అక్కడ బస్సు కోసం వేచి ఉన్న మహిళలను ఢీకొట్టడంతో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. అయితే అప్పటికే ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఈ ప్రమాదంతో శంషాబాద్–సతమరాయి మార్గంలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. రోడ్డుపై ప్రమాదానికి గురైన వాహనం, సహాయక చర్యల కారణంగా ట్రాఫిక్ స్తంభించింది. దీంతో అధికారులు రంగంలోకి దిగి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించే చర్యలు చేపట్టారు. ప్రమాదానికి అసలు కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


