TPCC Revanth Reddy Political Challenge To CM KCR - Sakshi
Sakshi News home page

దమ్ముంటే నాలుగు రోజుల్లో ప్రభుత్వాన్ని రద్దు చెయ్‌

Jul 11 2022 8:00 PM | Updated on Jul 12 2022 1:37 AM

TPCC Revanth Reddy Political Challenge To CM KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ బిడ్డవే అయితే, దమ్ముంటే నాలుగు రోజుల్లోపు మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వా­న్ని రద్దు చేయాలని సీఎం కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి సవాల్‌ చేశారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో 90 లక్షల ఓట్లతో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాబోతోందని, ఒక్క ఓటు తక్కువ వచ్చినా తన పేరు మార్చుకుంటానని సీఎం కేసీఆర్‌కు సవాల్‌ విసిరారు. జూబ్లీహిల్స్‌లోని తన పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో రేవంత్‌రెడ్డి సోమవా­రం విలేకరులతో మాట్లాడారు. ఆయనతోపాటు ఆ పార్టీ కీలక నేతలు ముందస్తు ఎన్నికలపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాయి. 

రాహుల్‌ సభతో పెరిగిన కాంగ్రెస్‌ గ్రాఫ్‌ 
సీఎం కేసీఆర్‌కు కన్సల్టెంట్‌గా ఉన్న ప్రశాంత్‌ కిషోర్‌తోపాటు రవిచంద్ర, మస్తాన్, రాష్ట్ర, సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌... ఇలా పలు సంస్థలు సర్వేలు చేసి ఇటీవల కేసీఆర్‌కు నివేదిక అందించారని, ఏ నివేదిక చూసినా ఆయనకు మైండ్‌ బ్లాంక్‌ అయిందని రేవంత్‌ వ్యాఖ్యానించారు. రాహుల్‌ వరంగల్‌ రైతు డిక్లరేషన్‌ సభ తర్వాత అనూహ్య స్థాయిలో కాంగ్రెస్‌ పార్టీ పట్ల ప్రజల్లో నమ్మకం పెరిగినట్లు సర్వేల్లో తేలిందన్నారు.

ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే టీఆర్‌ఎస్‌కు 25 సీట్లు మాత్రమే వస్తాయని, మరో 17 సీట్లలో గట్టి పోటీ ఉంటుందని ప్రశాంత్‌కిషోర్‌ సర్వే నివేదికలో తేలిందన్నారు. కాంగ్రెస్‌ 32 స్థానాల్లో గెలుస్తుందని, మరో 23 స్థానాల్లో పోటాపోటీ ఉంటుందని నివేదికలో పేర్కొన్నట్లు రేవంత్‌ చెప్పారు. బీజేపీకి 6 నుంచి 8 సీట్లలో గెలుపు, మరో 8 సీట్లలో పోటీలో ఉంటుందని, ఎంఐఎం 5 నుంచి 7 సీట్లలో గెలిచే అవకాశం ఉందని పీకే రిపోర్టు మాత్రమే కాదు.. అన్ని సర్వేలు దాదాపు అవే చెబుతున్నాయని రేవంత్‌ వెల్లడించారు.

ఇక ఓట్ల శాతంగా చూస్తే కేవలం టీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్‌కు 5 నుంచి 7 శాతం మాత్రమే తేడా ఉందని, టీఆర్‌ఎస్‌ 37 నుంచి 39, కాంగ్రెస్‌ 30 నుంచి 32, బీజేపీ 11 నుంచి 13, ఎంఐఎం 2 నుంచి 7 శాతం, షర్మిల 0.6 శాతం మేర ఓట్లు ఇప్పటికప్పుడు ఎన్నికలు వస్తే సాధించే స్థాయిలో ఉన్నాయని పీకే వెల్లడించినట్టు తెలిపారు.  

కాంగ్రెస్‌ బలపడుతుందనే..  
వరంగల్‌ రైతు డిక్లరేషన్‌ సభ తర్వాత కాంగ్రెస్‌ గ్రాఫ్‌ 3 శాతం పెరిగిందని, కాంగ్రెస్‌ రాç­Ù్ట్రంలో అ«ధికారంలోకి వచ్చే అవకాశం ఉందని నివేదికల్లో స్పష్టం కావడంతో ప్రధా­ని మోదీ, సీఎం కేసీఆర్‌ ఒకరినొకరు గో­క్కునే విధంగా వ్యవహరిస్తున్నారని రేవంత్‌ దుయ్యబట్టారు. ఇదే స్థాయిలో కాంగ్రెస్‌ గ్రాఫ్‌ పెరిగితే తన పని ఔట్‌ అన్న భయంతో ముందస్తు అంటూ కేసీఆర్‌ ఫాంహౌస్‌ నుంచి బయటకు వచ్చారని రేవంత్‌ ఆరోపించారు. గజ్వేల్‌లో కేసీఆర్‌ను ఓడించేది కాం­గ్రెస్‌ అభ్యర్థియేనని, అందులో సందేహం లేదన్నారు. ఈటల గజ్వేల్‌ నుంచి పోటీ­చేస్తానని అన్నారే తప్ప ఏ పార్టీ నుంచో చెప్పలేదు కదా అని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. 

కేసీఆర్‌ అసమర్థ ముఖ్యమంత్రి: ఉత్తమ్‌ 
సీఎం కేసీఆర్‌ కనీస ఇంగితజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని, ఇంత అసమర్థ సీఎంను ఎక్కడా చూడలేదని పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తీవ్రంగా వ్యాఖ్యానించారు. సవాల్‌ చేసుడు కాదు, దమ్ముంటే అసెంబ్లీ రద్దు చేసి చూడు అని ఉత్తమ్‌ సవాల్‌ చేశారు. ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌కు ఓటుతో బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ప్రజా సమస్యలను పక్కన పెట్టి ఎన్నికల పేరుతో ప్రజల దృష్టిని మరల్చేందుకు కేసీఆర్‌ సవాళ్లు చేస్తున్నారని ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి విమర్శించారు.    

ఇది కూడా చదవండి: బుల్లెట్‌ అర ఇంచే ఉంటుంది.. గుండెల్లో దిగితే తెలుస్తుంది: కేసీఆర్‌కు ఈటల చురకలు

Advertisement
 
Advertisement
Advertisement