నేటితో ధాన్యం వేలం బిడ్‌ల దాఖలుకు గడువు పూర్తి  | Today is the deadline for submission of grain auction bids | Sakshi
Sakshi News home page

నేటితో ధాన్యం వేలం బిడ్‌ల దాఖలుకు గడువు పూర్తి 

Feb 9 2024 4:11 AM | Updated on Feb 9 2024 4:11 AM

Today is the deadline for submission of grain auction bids - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని రైస్‌మిల్లుల్లో నిల్వ ఉన్న 2022–23 రబీ సీజన్‌కు సంబంధించిన 35 లక్షల మెట్రిక్‌ టన్నులు (ఎల్‌ఎంటీ)ల ధాన్యం వేలం బిడ్‌ల దాఖలుకు గడువు శుక్రవారంతో ముగియనుంది. గత రబీలో సేకరించిన ధాన్యాన్ని రా రైస్‌గా మిల్లింగ్‌ చేయడానికి మిల్లర్లు ఆసక్తి చూపని విషయం తెలిసిందే.

రబీలో సేకరించిన 66.84 ఎల్‌ఎంటీల ధాన్యం నుంచి బాయిల్డ్‌ రైస్‌కు సంబంధించి భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) ఇచ్చిన టార్గెట్‌ ప్రకారం సుమారు 20 ఎల్‌ఎంటీల ధాన్యాన్ని మాత్రమే మిల్లింగ్‌ చేసి కస్టమ్‌ మిల్డ్‌ రైస్‌ (సీఎంఆర్‌) కింద ఎఫ్‌సీఐకు అప్పగించాలని నిర్ణయించారు. మిగతా ధాన్యాన్ని ముడి బియ్యంగా ఇవ్వాల్సి ఉండటంతో వారు ససేమిరా అన్నారు.

దీంతో గత ప్రభుత్వం 25 ఎల్‌ఎంటీల ధాన్యం కోసం బిడ్లు ఆహ్వానించినప్పటికీ, ఎన్నికల నేపథ్యంలో ఆ ప్రక్రియ రద్దయింది. దీంతో గత నెలలో గ్లోబల్‌ టెండర్‌ నోటీస్‌ జారీ చేశారు. ఈ మేరకు వేలంలో పాల్గొనే బిడ్డర్లతో ఇటీవల సమావేశం జరగగా, వేలం నిబంధనల్లో కొన్ని సవరణలను సూచించారు. ఈ మేరకు నిబంధనలను మారుస్తూ బిడ్లు దాఖలు చేసేందుకు గడువును శుక్రవారం వరకు పొడిగించారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement