పాకిస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశంలోని ప్రధాన నగరాలలోని అంతర్జాతీయ ఎయిర్పోర్టులను బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా వేలం వేయనున్నట్లు తెలిపింది. ఆసక్తి ఉన్న బహుళజాతి కంపెనీలు బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొనవచ్చని ప్రకటించింది.
ఇటీవల యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భారత్లో ఆకస్మిక పర్యటన చేశారు. అనంతరం కొద్దిరోజులకే ఆయన పాకిస్థాన్లోని కరాచీ ఎయిర్పోర్టు నిర్వహించే బాధ్యతనుంచి యూఏఈ తప్పుకుంటుందని ప్రకటించారు. ఈ విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆ దేశంలోని అంతర్జాతీయ విమానాశ్రయాల నిర్వహణకు బిడ్డింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు.
పాకిస్థాన్లోని ఇస్లామాబాద్, కరాచీ, లాహెర్ విమానాశ్రయాల నిర్వహణను ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు బిడ్డింగ్ ప్రక్రియను నిర్వహించనున్నట్లు ఆ దేశ అధికారులు తెలిపారు. గతంలో ఇస్లామాబాద్ విమానాశ్రయం నిర్వహణను ప్రభుత్వమే నిర్వహించాలని భావించినా ప్రస్తుతం ఆ ఆలోచన నుంచి విరమించుకున్నట్లు తెలిపారు.
దీనికోసం దేశీయ సంస్థలతో పాటు ఆసక్తి ఉన్న అంతర్జాతీయ సంస్థలు సైతం బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొనవచ్చని అధికారులు పేర్కొన్నారు. విమానాశ్రయాల కార్యకలాపాల సామర్థ్యాలను పెంచడంతో పాటు మౌలిక సదుపాయాలను ఆధునీకరించడం పెట్టుబడులను ప్రోత్సహించడం తదితర కారణాల రీత్యా వీటికి బిడ్డింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ బిడ్డింగ్ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరుగుతుందని ఇందులో ఎటువంటి రాజకీయాలకు తావులేదని పేర్కొన్నారు.
కాగా ఈ విషయంలో యుఏఈ టర్కీ, సౌదీ అరేబియా వంటి దేశాలకు చెందిన సంస్థలతో సానుకూల చర్చలు జరిగాయని అయితే ఇస్లామాబాద్ విమానాశ్రయాన్ని యుఏఈకి లీజ్ ఇచ్చినట్లు వచ్చిన వార్తలు అసత్యమని పాక్ తెలిపింది. అటువంటి ఒప్పందాలు ఏవి జరగలేదని పేర్కొంది.


