
బంజారాహిల్స్(హైదరాబాద్): గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మికి గత మూడు రోజుల నుంచి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, నిందితున్ని పట్టుకుని చర్యలు తీసుకోవాలని ఆమె పీఆర్ఓ అఖిల్ బంజారాహిల్స్ పీఎస్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఫోన్ నంబర్ ఆధారంగా నిందితుని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
మేయర్కు మూడు రోజులుగా ఒకే వ్యక్తి ఫోన్లు చేస్తూ బెదిరింపులకు పాల్పడటమే కాకుండా ఆమెను ఇబ్బంది పెట్టసాగాడు. దీంతో మేయర్ పీఆర్ఓ ఫిర్యాదు చేయగా, ఈ నంబర్ కోసం ఆరా తీస్తున్నారు. అడ్రస్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్లు గుర్తించారు. నిదింతుని జాడ కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా, మేయర్ ఇంటికి గతంలోనూ ఓ వ్యక్తి వచ్చి బెదిరింపులకు పాల్పడగా, అప్పుడు నిదింతునిపై చర్యలు తీసుకున్నారు.