ఈ ‘టీ’తో నష్టాలే! | Tea Powder Adulteration Racket Busted in Hyderabad 3 Arrest | Sakshi
Sakshi News home page

ఈ ‘టీ’తో నష్టాలే!

Oct 10 2024 1:27 PM | Updated on Oct 10 2024 1:27 PM

Tea Powder Adulteration Racket Busted in Hyderabad 3 Arrest

ప్రమాదకర రసాయనాలు వినియోగించి తయారీ 

 గుట్టురట్టు చేసిన సెంట్రల్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌ 

300 కేజీల కల్తీ టీ పొడి, ఫ్లేవర్స్‌ తదితరాలు సీజ్‌  

సాక్షి, హైదరాబాద్‌: నాసిరకమైన టీ పొడిలో కొబ్బరి చిప్ప పొడి, రసాయనాలు, రంగులు, చాక్లెట్‌ ఫ్లేవర్, మిల్క్‌ పౌడర్‌ కలిపి కల్తీ టీ పొడి తయారు చేస్తున్న ముఠాకు మధ్య మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు చెక్‌ చెప్పారు. ముగ్గురు నిందితులను పట్టుకుని వారి నుంచి 300 కేజీల కల్తీ టీ పొడి, 200 కేజీల కొబ్బరి చిప్పల పొడి స్వా«దీనం చేసుకున్నట్లు డీసీపీ వైవీఎస్‌ సుదీంద్ర బుధవారం తెలిపారు. ఫతేనగర్‌కు చెందిన జగన్నాథ్‌ కోణార్క్‌ టీ పౌడర్‌ సేల్స్‌ అండ్‌ సప్లయర్స్‌ పేరుతో వ్యాపారం చేస్తున్నాడు. 

తేలిగ్గా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో కల్తీ టీ పొడి తయారీకి సిద్ధమయ్యాడు. మార్కెట్‌ నుంచి కేజీ రూ.80 ఖరీదు చేసే టీ పొడి, రసాయనాలు, రంగులు, ఫ్లేవర్స్‌తో పాటు కొబ్బరి చిప్పల పొడి కొనేవాడు. దీన్ని తన దుకాణానికి తీసుకువెళ్లి తన వద్ద పని చేసే ప్రతాప్, పరాదాలకు ఇచ్చే వాడు. వీళ్లు వాటన్నింటినీ కలిపి కల్తీ టీ పొడి తయారు చేసి ప్యాక్‌ చేసే వారు. ఈ పొడిని కేజీ రూ.250కి అమ్మే జగన్నాథ్‌ లాభాలు ఆర్జిస్తున్నాడు. ఈ టీ పొడిని ఎక్కువగా చిన్న చిన్న దుకాణదారులతో పాటు రోడ్డు పక్కన టీ స్టాల్స్‌కు అమ్మేవాడు. 

వీరి వ్యవహారంపై సమాచారం అందుకున్న మధ్య మండల టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌.రామకృష్ణ నేతృత్వంలో ఎస్సై డి.శ్రీకాంత్‌ గౌడ్‌ వలపన్ని ముగ్గురినీ పట్టుకున్నారు. నిందితులతో పాటు స్వాధీనం చేసుకున్న సరుకును సనత్‌నగర్‌ పోలీసులకు అప్పగించారు. జగన్నాథ్‌పై ఇప్పటికే మోమిన్‌పేట్, సనత్‌నగర్‌ ఠాణాల్లో మూడు ఇదే తరహా కేసులు ఉన్నాయని, అయినప్పటికీ అతడు తన పంథా కొనసాగస్తున్నాడని డీసీపీ తెలిపారు. కల్తీ పొడితో చేసిన టీ తాగడం వల్ల కేన్సర్, కామెర్లు సహా అనేక వ్యాధుల బారినపడే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement