పలకరించిన తొలకరి | Southwest monsoon reaches in Telangana | Sakshi
Sakshi News home page

పలకరించిన తొలకరి

May 27 2025 5:55 AM | Updated on May 27 2025 5:56 AM

Southwest monsoon reaches in Telangana

రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు

తెలంగాణవ్యాప్తంగా సగటున 1.1 సెం.మీ. వర్షపాతం నమోదు 

రంగారెడ్డి జిల్లా కేతిరెడ్డిపల్లిలో అత్యధికంగా 6 సెం.మీ. వర్షం 

నేడు బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం 

3 రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం

సాక్షి, హైదరాబాద్‌: వానాకాలం ప్రారంభాన్ని సూచిస్తూ రాష్ట్రంలోకి సోమవారం నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి వారం ముందే పలకరించాయి. దీని ప్రభావంతో వివిధ జిల్లాల్లో తొలకరి జల్లులు కురిశాయి. రంగారెడ్డి, వికారాబాద్, మెదక్, నిర్మల్, సంగారెడ్డి, నారాయణపేట, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 1.1 సెం.మీ. మేర సగటు వర్షపాతం నమోదైంది.

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలం కేతిరెడ్డిపల్లిలో అత్యధికంగా 5.98 సెం.మీ. వర్షం కురిసింది. అదే జిల్లాలోని షాబాద్‌ మండలం చందన్వెల్లిలో 5.68 సెం.మీ., భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అల్లాపల్లిలో 5.4 సెం.మీ., మహబూబ్‌నగర్‌ జిల్లా గండీడ్‌లో 3.78 సెం.మీ., వికారాబాద్‌ జిల్లా కొడంగల్లో 3.10 సెం.మీ. మేర వర్షపాతం నమోదైంది. ఇప్పటికే అడపాదడపా వర్షాలతో రైతులు సాగు పనులకు సిద్ధమవుతున్న వేళ రుతుపవనాలు ముందుగానే పలకరించడంతో వ్యవసాయ పనులను కూడా ముందస్తుగానే ప్రారంభించొచ్చని అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

ఈసారి సాధారణం కంటే 10 శాతం అధిక వర్షాలు 
నైరుతి సీజన్‌లో నాలుగు నెలలపాటు రాష్ట్రంలో కురవాల్సిన సాధారణ వర్షపాతం 73.86 సెంటీమీటర్లు. గతేడాది సీజన్‌లో 96.26 సెం.మీ. వర్షం (సాధారణ కంటే 30 శాతం అధికం) కురవగా ఈసారి వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. కనీసం 10 శాతం అధికంగా వర్షాలు కురవొచ్చని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. 

అల్పపీడనం.. ఆపై వానలు.. 
దక్షిణమధ్య బంగాళాఖాతం, ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సోమ­వారం ఓ ప్రకటనలో తెలిపింది. నైరుతి సీజన్‌లో బంగాళాఖాతంలో ఏర్పడే ఉపరితల ఆవర్తనం, అల్పపీడనాలు, వాయుగుండాలు, తుపానుల ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈసారి రాష్ట్రంలోకి రుతుపవనా­లు ప్రవేశించిన మర్నాడే అల్పపీడనం ఏర్పడటంతో భారీ వర్షా­లు కురవొచ్చని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.

అల్పపీడనం ప్రభావంతో రానున్న మూడు రోజులు తెలంగాణవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొ­న్నిచోట్ల భారీ, ఇంకొన్ని చోట్ల అతిభారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement