సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుతో పెళ్లి.. ఆరు నెలలకే టెకీ ఆత్మహత్య | Software Engineer Sushma Ends Her Life After 6 Months Of Marriage In Hyderabad, Know More Details | Sakshi
Sakshi News home page

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుతో పెళ్లి.. ఆరు నెలలకే టెకీ ఆత్మహత్య

Jun 20 2025 7:10 AM | Updated on Jun 20 2025 9:18 AM

Software Engineer Sushma Incident Full Deatils

సాక్షి, హైదరాబాద్‌: అత్తింటివారి అదనపు కట్నం వేధింపుల కారణంగా పెళ్లయిన ఆరు నెలలకే ఓ మహిళా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు ఆత్మహత్య చేసుకుంది. హైటెక్‌ సిటీ వద్ద దుర్గం చెరువులో దూకి తనువు చాలించింది. ఈ క్రమంలో మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో భర్తతోపాటు అత్త, మామలు, మరిదిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

వివరాల ప్రకారం.. ఈస్ట్‌మారేడ్‌పల్లిలోని అడ్డగుట్టలో ఉంటున్న అంజయ్య, సుశీల దంపతుల కుమార్తె సుష్మ(27). ఈ ఏడాది జనవరి 31న సుష్మను నేరేడ్‌మెట్‌కు చెందిన అమృత్‌కు ఇచ్చి  వివాహం చేశారు. సుష్మ, ఆమె భర్త అమృత్‌ ఇద్దరూ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లుగా చేస్తున్నారు. పెళ్లి సమయంలో రూ.5లక్షల నగదు, 6 తులాల బంగారం, రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైకు కట్నంగా కింద ఇచ్చారు. అయితే, పెళ్లి అయిన కొద్ది రోజులకే అదనపు కట్నం కావాలంటూ భర్తతోపాటు అత్త, మామ, మరిది కలిసి సుష్మను వేధింపులకు గురి చేయడం ప్రారంభించారు. అనారోగ్యంతో ఉన్న సుష్మను ఈనెల 13న ఆసుపత్రిలో చేర్పించారు. 16న డిశ్చార్జి అయిన ఆమెను తల్లిదండ్రులు పుట్టింటికి తీసుకెళ్లారు. మరుసటి రోజు ల్యాప్‌టాప్‌ తెచ్చుకునేందుకు సుష్మ తండ్రితో కలిసి అత్తగారింటికి వెళ్లింది.

ఈ సందర్భంగా భర్తతో సహా కుటుంబ సభ్యులు పరుషంగా మాట్లాడారు. మళ్లీ ఎందుకు వచ్చావంటూ సూటిపోటి మాటలు అనడమే కాకుండా అదనపు కట్నం తీసుకురావాలంటూ ఆమె తండ్రి అంజయ్యను కూడా దూషించారు. దీంతో, సుష్మ మనస్తాపానికి గురైంది. బుధవారం మధ్యాహ్నం కంపెనీలో విధులకు వెళ్లింది. రాత్రి ఒంటి గంట వరకు ఇంటికి రాకపోవడంతో తండ్రి అంజయ్య కంపెనీ మేనేజర్‌కు ఫోన్‌ చేశాడు. రాత్రి 8.30 గంటల సమయంలోనే ఆమె బయటకు వెళ్లిందని చెప్పాడు.

అలా చెప్పడంతో కంగారు పడిన అంజయ్య.. తెలిసిన చోట గాలించి గురువారం తెల్లవారు జామున 4 గంటలకు మాదాపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకొని గాలింపు చర్యలు చేపట్టారు. ఉదయం 7.30 గంటల సమయంలో దుర్గం చెరువులో ఓ మహిళ శవం తేలిందని స్థానికులు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి సుష్మ మృతదేహంగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్ట నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. సుష్మ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అత్తింటి వారిపై పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement