
జగిత్యాల టౌన్: ఆర్టీసీ బస్సు గేర్ బాక్సులో పాము దూరడంతో ప్రయాణికులు భయభ్రాంతులై పరుగులు తీశారు. వివరాలివి. మంగళవారం ఉదయం కరీంనగర్ జిల్లా నుంచి జగిత్యాల జిల్లాకు వస్తున్న పల్లె వెలుగు బస్సు.. జగిత్యాల పట్టణంలోని కరీంనగర్ డెయిరీ ప్రాంతానికి చేరుకుంది. అక్కడ రోడ్డుకు అడ్డంగా పాము రావడాన్ని గమనించిన డ్రైవర్.. దాన్ని కాపాడే ఉద్దేశంతో బస్సును అకస్మాత్తుగా నిలిపివేశాడు.
రోడ్డు దాటి వెళ్లాల్సిన పాము.. బస్సు కింది భాగం నుంచి గేర్ బాక్సులోకి దూరింది. దీంతో ప్రయాణికులు ఆందోళనకు గురై బస్సు దిగి పరుగులు తీశారు. ఏం చేయాలో తెలియని డ్రైవర్ బస్సును రోడ్డుపైనే నిలిపి ఉంచడంతో అర్ధగంట పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. స్థానిక యువకులు గేర్బాక్సులో దూరిన పామును బయటకు లాగి చంపిన అనంతరం.. బస్సు అక్కడి నుంచి బయలుదేరింది.