అమ్మకు భారమైతే.. ఊయల ఆదరిస్తుంది | Shishu Vihar In Karimnagar, Know Complete Details About This Agency | Sakshi
Sakshi News home page

అమ్మకు భారమైతే.. ఊయల ఆదరిస్తుంది

Jun 1 2025 12:57 PM | Updated on Jun 1 2025 1:39 PM

Shishu Vihar in Karimnagar

కరీంనగర్‌: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఏటా పదుల సంఖ్యలో చిన్నారులను తల్లిదండ్రులు వదిలేస్తున్న ఘటనలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో పిల్లలను పెంచలేని పరిస్థితుల్లో ఉంటే కరీంనగర్‌లోని శిశువిహార్‌కు అప్పగించాలని, పోషకాహారం, వసతి సమకూర్చి విద్యను నేర్పిస్తూ కన్నబిడ్డలా కాపాడుకుంటామని అధికారులు పేర్కొంటున్నారు. పెళ్లీడు వచ్చినవారికి పెళ్లి పెద్దగా ఉండి వివాహం సైతం జరిపిస్తామంటున్నారు. ఇటీవల ఓ అమ్మాయికి కరీంనగర్‌ కలెక్టర్‌ పమేలా సత్పతి దగ్గరుండి పెళ్లి జరిపించడం విశేషం.

వద్దనుకునే వారికి ఊయల
రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ గతంలో ఊయల పథకాన్ని తీసుకువచ్చింది. కరీంనగర్‌లోని మాతాశిశు సంరక్షణ కేంద్రంలో కలెక్టర్‌ పమేలా సత్పతి ఊయల కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ పథకం గురించి మొదట్లో చాలా మందికి అవగాహన లేకపోగా, కలెక్టర్‌ విస్తృత ప్రచారం నిర్వహించేలా చొరవతీసుకున్నారు. తల్లిదండ్రులెవరైనా తమ బిడ్డలను పెంచలేని పరిస్థితుల్లో ఉంటే ఆయా జిల్లాల్లోని శిశు గృహాలను సంప్రదించవచ్చు. తల్లిదండ్రులతో అధికారులు మాట్లాడి చిన్నారులను వదులుకోవడానికి గల కారణాలు తెలుసుకుంటారు. అవసరమైతే కౌన్సెలింగ్‌ ఇస్తారు. అప్పటికీ వారిలో మార్పు రాకుంటే సంరక్షణ బాధ్యత తీసుకుంటారు.

 కొన్నినెలల తర్వాత మళ్లీ పిలిచి చిన్నారిని తీసుకుంటారా, లేదా అని ఆరా తీస్తారు. అప్పటికీ అంగీకరించకుంటే చిన్నారి పూర్తి సంరక్షణ బాధ్యతను శిశువిహార్‌ అధికారులు తీసుకుంటారు. తర్వాత దత్తతకు అర్హులైన పిల్లలుగా గుర్తిస్తారు. ఇలా ఏటా కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని శిశువిహార్‌కు పదుల సంఖ్యలో చిన్నారులు వస్తున్నట్లు అధికారులు తెలిపారు. శిశువిహార్‌లో ఉండి ఉన్నత చదువులు అభ్యసించి మంచి ఉద్యోగాలు సాధించిన వారు ఎందరో ఉన్నారు. ఐదేళ్ల లోపు చిన్నారులను ఎవరైనా దత్తత తీసుకునేందుకు ముందుకొస్తే నిబంధనల ప్రకారం ఆర్థిక నేపథ్యం సహా అన్ని వివరాలు పరిశీలించి అప్పగిస్తున్నారు.

దత్తత కోసం విదేశాల నుంచి..
ఏటా పిల్లలను దత్తత తీసుకునేందుకు మన ప్రాంతానికి చెందిన వారే కాకుండా విదేశాల నుంచి దరఖాస్తు చేసుకుంటున్నారు. తెలంగాణకు చెందిన ప లువురు దంపతులు 77 మందిని, ఆ్రంధ్రప్రదేశ్‌లో నలుగురు, తమిళనాడు, కర్ణాటకలో ముగ్గురు చొ ప్పున, మహారాష్ట్రలో ఇద్దరు, ఒడిశా, న్యూ ఢిల్లీలో ఒక్కరు చొప్పున దత్తత తీసుకున్నారు. అలాగే ఇ టలీ దేశం వారు ముగ్గురిని, అమెరికా, సింగాపూర్‌ వారు ఒక్కరు చొప్పున దత్తత తీసుకోవడం విశేషం.

2011 నుంచి 2025 వరకు..
2011 నుంచి 2025 వరకు పలువురు దంపతులు 96 మంది పిల్లలను దత్తత తీసుకున్నారు. 2011లో ఏడుగురు, 2012లో ఒక్కరు, 2013లో 9 మంది, 2014లో ఇద్దరు, 2015లో 11 మంది, 2016లో ఏడుగురు, 2017లో ఒక్కరు, 2018లో ఐదుగురు, 2019లో ఐదుగురు, 2020లో ఏడుగురు, 2021లో ముగ్గురు, 2022లో 10 మంది, 2023లో 9 మంది, 2024లో 17 మంది, 2025లో ఇప్పటి వరకు ఇద్దరిని దత్తత తీసుకున్నారు.

ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఇలా..
పిల్లలు లేని దంపతులకు మహిళా శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శిశుగృహలో దత్తత కార్యక్రమం నిర్వహిస్తారు. సీఏఆర్‌ నిబంధనల ప్రకారం పాన్, ఆధార్, వయస్సు, వివాహ, ఆదాయ ధ్రువపత్రాలు, మెడికల్‌ సర్టిఫికెట్లు, దంపతుల ఫొటో, సింగిల్‌ పేరెంట్‌ అయితే విడాకుల డిక్రీ/మరణ ధ్రువపత్రం, ఇద్దరు వ్యక్తుల సిఫార్సు లేఖలు ఉన్న పత్రాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌æ చేయాలి. డాక్యుమెంట్లు అప్‌లోడ్‌ అయిన తర్వాత 3 సెట్ల కాపీలు, రూ.6వేలు డీడీని జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలో సమర్పించాలి. సీనియారిటీ, అర్హత ప్రకారం కోర్టు ఉత్తర్వులు, బర్త్‌ సర్టిఫికెట్‌తో పిల్లలను దత్తత ఇస్తారు.

చట్టపరంగా దత్తత తీసుకోవాలి
చట్టప్రకారం దత్తత తీసుకుంటే భవిష్యత్తులో సమస్యలు రావు. ఆసక్తి ఉన్న దంపతులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి. పుట్టిన శిశువు వద్దనుకునే తల్లిదండ్రులు మాతా శిశు కేంద్రంలో ఏర్పాటు చేసిన ఊయలలో వదిలి వెళ్లాలి.                  
 – సరస్వతి, జిల్లా సంక్షేమ అధికారి, కరీంనగర్‌  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement