హైదరాబాద్‌లో శ్రీచైతన్య సంస్థల క్రీడోత్సవం | SAT Chairman Shiva Sena Reddy inaugurates BS Rao Memorial Sports | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో శ్రీచైతన్య సంస్థల క్రీడోత్సవం

Apr 19 2025 11:21 AM | Updated on Apr 19 2025 11:22 AM

SAT Chairman Shiva Sena Reddy inaugurates BS Rao Memorial Sports

క్రీడలతో మానసిక ఉత్తేజం పెరిగి విద్యార్థులు మరింత ఉత్సాహం, ఉత్తేజం తెచ్చుకుంటారని తెలంగాణ రాష్ట్ర క్రీడల ప్రాధికార సంస్థ అధ్యక్షుడు కె. శివ సేనారెడ్డి అన్నారు.  శ్రీ చైతన్య విద్యాసంస్థలు నిర్వహించిన డా. బి. ఎస్. రావు స్మారక రాష్ట్రస్థాయి క్రీడా పోటీల కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రైల్వే మహిళల వాలీబాల్ జట్టు కోచ్ ఎం.సి. షాజియా, జాతీయ మహిళా క్రికెట్ జట్టు సభ్యురాలు గొంగడి త్రిష ప్రత్యేక అతిథిగా పాల్గొని విద్యార్థులకు స్ఫూర్తిని కలిగించారు.

హైదరాబాద్‌లోని కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో జరిగిన ఈ క్రీడా ఉత్సవంలో దేశవ్యాప్తంగా ఉన్న 640 శ్రీ చైతన్య పాఠశాలలు పాల్గొన్నాయి. అందులోని తెలంగాణలోని 7 జోన్లకు చెందిన 80 బ్రాంచీల మధ్య ఫైనల్స్ నిర్వహించబడ్డాయి. 63,919 మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొనగా, జోనల్ స్థాయికి అర్హత పొందిన ప్రతి జోన్‌కు చెందిన 110 మంది విద్యార్థుల్లో నుంచి ఎంపికైన 800 మంది విద్యార్థులు ఈ ఫైనల్స్‌లో పాల్గొన్నారు.

సీనియర్‌, జూనియర్‌ విభాగాల్లో వాలీబాల్, థ్రోబాల్, బ్యాడ్మింటన్‌తో పాటు అథ్లెటిక్స్‌ విభాగంలో రన్నింగ్‌, షాట్‌పుట్‌ తదితర ఈవెంట్లలో పోటీలు జరిగాయి. విద్యార్థులు తమ ప్రతిభను, క్రీడాస్ఫూర్తిని చాటుతూ ఉత్సాహంగా పాల్గొన్నారు. ముఖ్య అతిథులు విజేతలకు అభినందనలు తెలుపుతూ, మానసిక అభివృద్ధిలో క్రీడల ప్రాధాన్యతను వివరించారు.

విజేతలను అభినందించిన శ్రీ చైతన్య విద్యాసంస్థల అకాడెమిక్ డైరెక్టర్ సీమ.., శారీరక మరియు మానసిక అభివృద్ధి ఒకదానికొకటి పూరకంగా ఉంటాయని, క్రీడల వల్ల విద్యార్థుల అకడమిక్ పనితీరు మెరుగవుతుందన్నారు. ఈ పోటీలను సంస్థ స్థాపక ఛైర్మన్ డా. బి. ఎస్. రావు గారిని స్మరించుకుంటూ నిర్వహించామని, చిన్ననాటి నుంచే పోటీ స్పూర్తిని విద్యార్థుల్లో నాటడం శ్రీచైతన్య సంస్థల ప్రధాన ఉద్దేశ్యమని డైరెక్టర్‌ సీమ తెలియజేశారు. ఈ కార్యక్రమం విద్యా రంగాన్ని క్రీడలతో మేళవించి, విద్యార్థులకు హోలిస్టిక్ డెవలప్‌మెంట్ వేదికగా నిలిచింది.

Advertisement
 
Advertisement
Advertisement