Miss World 2025: మిస్‌ వరల్డ్‌ చువాంగ్‌శ్రీ | Opal Suchata Chuangsri Has Been Crowned Miss World 2025, Know Interesting Facts About Her | Sakshi
Sakshi News home page

Miss World 2025: మిస్‌ వరల్డ్‌ చువాంగ్‌శ్రీ

Jun 1 2025 2:02 AM | Updated on Jun 1 2025 5:56 PM

Opal Suchata Chuangsri has been crowned Miss World 2025

మిస్‌ వరల్డ్‌–2025గా ఎంపికైన ఒపల్‌ సుచాత చువాంగ్‌శ్రీ (థాయ్‌లాండ్‌)కి బ్లూక్రౌన్‌ను అలంకరిస్తున్న మిస్‌ వరల్డ్‌–2024 క్రిష్టినా పిష్కోవా

థాయ్‌ భామను వరించిన అందాల కిరీటం..

ఒపల్‌ సుచాత చువాంగ్‌శ్రీకి  రూ. 6.5 కోట్ల విలువైన బ్లూక్రౌన్‌ను అలంకరించిన ప్రస్తుత మిస్‌ వరల్డ్‌ క్రిష్టినా పిష్కోవా   

విజేతకు రూ. 8.5 కోట్ల ప్రైజ్‌మనీ, నగలు, డిజైనర్‌ దుస్తులు సొంతం 

టాప్‌–8లోకే చేరుకోలేకపోయిన మిస్‌ ఇండియా నందినీ గుప్తా  

ఫస్ట్‌ రన్నరప్‌గా ఇథియోపియా సుందరి, రెండో రన్నరప్‌ పోలాండ్‌ భామ, మూడో రన్నరప్‌గా మార్టినిక్‌ సుందరి..

సాక్షి, హైదరాబాద్‌: మిస్‌ వరల్డ్‌–2025గా థాయ్‌లాండ్‌ భామ ఒపల్‌ సుచాత చువాంగ్‌శ్రీ(21) ఎంపికైంది. హైదరాబాద్‌లోని హైటెక్స్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో శనివారం ఉత్కంఠభరితంగా జరిగిన 72వ ఎడిషన్‌ మిస్‌ వరల్డ్‌ గ్రాండ్‌ ఫినాలేలో ఆమె విజయం సాధించింది. ప్రస్తుత మిస్‌ వరల్డ్‌ క్రిష్టినా పిష్కోవా ఆమెకు రూ. 6.5 కోట్ల విలువైన బ్లూ క్రౌన్‌ను అలంకరించింది. 

ఈ విజయంతో ఆమె దాదాపు రూ. 8.5 కోట్ల ప్రైజ్‌మనీతోపాటు లండన్‌లో ఏడాదిపాటు నివాసం, డిజైనర్‌ దుస్తులు, నగలు వంటి బహుమతులు, ఏడాదిపాటు ప్రపంచవ్యాప్తంగా ఉచిత విమాన ప్రయాణ సౌలభ్యం, స్టార్‌ హోటళ్లలో ఉచిత బస వసతి పొందనుంది. మొదటి రన్నరప్‌గా ఇథియోపియాకు చెందిన హాసెట్‌ డెరెజె అడ్మాస్సు, రెండో రన్నరప్‌గా పోలాండ్‌కు చెందిన మజా క్లాజ్డా, మూడో రన్నరప్‌గా మార్టినిక్‌కు చెందిన ఆరేలీ జోచిమ్‌ నిలిచింది. భారత సుందరి నందినీ గుప్తా టాప్‌–8 జాబితాలో కూడా చోటుదక్కించుకోలేకపోయింది. 

అందరూ వచ్చి..  
మిస్‌ వరల్డ్‌ 72వ ఎడిషన్‌ గ్రాండ్‌ ఫినాలే అట్టహాసంగా జరిగింది. సాయంత్రం ఐదున్నరకే కార్యక్రమాలు మొదలయ్యాయి. తొలుత తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ వెంటనే 108 మంది భామలను రెడ్‌ కార్పెట్‌ మీదుగా వేదికపైకి సగౌరవంగా ఆహ్వానించారు. అనంతరం వ్యాఖ్యాత సచిన్‌ కుంభర్‌ అమెరికా–కరేబియన్, ఆసియా–ఓసియానియా, ఆఫ్రికా, యూరప్‌.. ఇలా నాలుగు భాగాలుగా విభజించి దేశాలవారీగా పోటీదారులను పరిచయం చేశారు. 

ఆ తర్వాత గ్రాండ్‌ ఫినాలేలో పోటీపడే టాప్‌–40 మందితో కూడిన బృందాన్ని పరిచయం చేశారు. ఒక్కో ఖండం నుంచి 10 మంది చొప్పున ఇందులో చేర్చారు. గత మూడు వారాలుగా జరిగిన ఐదు చాలెంజ్‌ల విజేతలైన 16 మందితోపాటు న్యాయ నిర్ణేతలు ఇచ్చిన మార్కుల ఆధారంగా మిగతా 24 మందిని వేదికపైకి ఆహ్వానించి మొత్తం 40 మందితో కూడిన బృందాన్ని సిద్ధం చేశారు. దీంతో పోటీ నుంచి వైదొలిగిన మిగతా వారు వేదికకు ఇరువైపులా ఏర్పాటు చేసిన స్థానాల్లో ఆసీనులయ్యారు. 

పోటీదారులు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న ప్రొఫైల్‌.. వారి చాతుర్యం.. మాటతీరు ఆధారంగా కేటాయించిన మార్పుల ఆధారంగా ఒక్కో ఖండం నుంచి ఐదుగురు చొప్పున ఉండే టాప్‌–20 మందితో కూడిన జాబితాను ప్రకటించారు. ఆ రౌండ్‌లో వైదొలిగిన వారు వెళ్లి వారి స్థానాల్లో కూర్చోగా తదుపరి రౌండ్‌లో ఒక్కో ఖండం నుంచి ఇద్దరు చొప్పున టాప్‌–8 మందిని (ఆఫ్రికా: నమీబియా, ఇథియోపియా, యూరప్‌: పోలాండ్, ఉక్రెయిన్, ఆసియా–ఓíÙయానియా: ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్, అమెరికా–కరీబియన్‌: బ్రెజిల్, మార్టినికా) షార్ట్‌ లిస్ట్‌ చేశారు. భారత సుందరి నందిని గుప్తా ఈ దశలోకి చేరుకోలేక నిష్క్రమించింది. 


‘మీరే ఎందుకు ప్రపంచ సుందరి కావాలనుకుంటున్నారు?’ 
టాప్‌–8 మంది సుందరీమణుల్లోంచి టాప్‌–4 భామలను ఎంపిక చేసేందుకు న్యాయ నిర్ణయితలు అడిగిన ప్రశ్నలు కీలక భూమిక పోషించాయి. గతంలో వారు పొందిన మార్కులు.. ఈ ప్రశ్నలకు వారు ఇచ్చిన సమాధానాల ఆధారంగా అప్పటికప్పుడు ఇచ్చిన మార్కులు కలిపి విజేతను ఎంపిక చేశారు. తొలుత 8 మందిని ప్రజెంటర్‌ సచిన్‌ కుంభర్‌ అడిగిన ‘మీరే ప్రపంచ సుందరి ఎందుకు కావాలనుకుంటున్నారు?’ అనే ప్రశ్నకు వారు ఇచ్చిన సమాధానం ఆధారంగా తుది పోరుకు థాయ్‌లాండ్, ఇథియోపియా, పోలాండ్, మార్టినిక్‌ సుందరీమణులను ఎంపిక చేశారు. 



ఉత్కంఠభరితంగా తుది పోరు... 
నలుగురు మాత్రమే వేదికపై ఉండి తుది పోరుకు సిద్ధమైన తరుణంలో ఆ ప్రాంగణమంతా ఉద్విగ్నత నెలకొంది. న్యాయ నిర్ణేతలైన మిస్‌ వరల్డ్‌ లిమిటెడ్‌ సీఈవో జూలియా మోర్లే, నటులు సోనూసూద్, రానా దగ్గుబాటి, నమ్రతా శిరోద్కర్‌ ఘట్టమనేని ఒక్కొక్కరికీ సంధించిన ప్రశ్నలకు పోటీదారులు ఇచ్చిన సమాధానాలు వారి స్థానాలను నిర్ణయించాయి. సోనూసూద్‌ అడిగిన ప్రశ్నకు అద్భుతంగా సమాధానమిచ్చిన థాయ్‌లాండ్‌ సుందరి ఒపల్‌ సుచాత చువాంగ్‌శ్రీ మిస్‌ వరల్డ్‌–2025గా ఎంపికైంది.   

సోనూసూద్‌కు మానవతావాది పురస్కారం  
కోవిడ్‌ సమయంలో వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న నిరుపేద కార్మికులు సొంతూళ్లకు వెళ్లేందుకు ఉచిత రవాణా వసతి కల్పించిన సినీనటుడు సోనూసూద్‌కు మిస్‌ వరల్డ్‌ మానవతావాది’ పురస్కారాన్ని మిస్‌వరల్డ్‌ సంస్థ ప్రకటించింది. ఆయనకు రానా దగ్గుబాటి బంగారు గ్లోబ్‌ను అందించారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement