హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డి రిమాండును నాంపల్లి కోర్టు తిరస్కరించింది. రూ.10 వేల పూచీకత్తులో 2 షూరిటీలు సమర్పించాలని ఆదేశించింది. షూరిటీలు సమర్పించాక విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. మధు, నవీన్ రెడ్డి ఇద్దరిపైనా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది.
తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్పై అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. తెలంగాణ శాసన సభా స్పీకర్ గడ్డం ప్రసాద్పై అనుచిత వ్యాఖ్యల కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అరెస్ట్ అయ్యారు. ఆయనతో పాటు మరో ఎమ్మెల్సీ నవీన్కుమార్రెడ్డిని కూడా పోలీసులు ఈ ఉదయం అదుపులోకి తీసుకున్నారు. ఈ ఇద్దరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయ్యింది. అయితే అరెస్ట్ సమయంలో న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద హైడ్రామా నడిచింది.
తెలంగాణ వర్షాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా.. శాసనసభ ప్రాంగణంలో నిన్న తాతా మధు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆయన స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అయితే తానేం దూషించలేదని నిన్ననే మధు వివరణ ఇచ్చారు. ఈ క్రమంలో.. ఈ ఉదయం ఎమ్మెల్సీ తాతా మధు ఇంటికి చేరుకున్న పోలీసులు ఆయన్ని ఇంట్లోంచి బయటకు రావాలని పిలిచారు. అయితే అందుకు ఆయన నిరాకరించారు.
సమాచారం అందుకున్న బీఆర్ఎస్ శ్రేణులు అక్కడికి చేరుకుని మధు అరెస్టును అడ్డుకునే ప్రయత్నం చేశాయి. అనంతరం అధికారులు వాళ్లతో మాట్లాడి ఆయన్ని తమ వెంట తీసుకెళ్లారు. మరోవైపు మరో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్కుమార్ రెడ్డిపై సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో బలవంతంగా ఆయన్ని తరలించారు.
ఇదీ చదవండి: ఏటీఎంలలో ఫెవిక్విక్.. మన డబ్బులు స్వాహా చేస్తున్న ముఠా


