దేవరకద్ర రూరల్: భార్యాభర్తల మధ్య ఏర్పడిన కుటుంబ కలహాలు భర్తను బలితీసుకున్నాయి. భర్తపై కత్తితో దాడిచేసి భార్య హతమార్చిన ఘటన మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని బస్వాయపల్లిలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం బస్వాయపల్లికి చెందిన కుర్వ నాగేశ్ (38)కు కోయిల్కొండ మండలం మల్కాపూర్కు చెందిన కవితతో వివాహం జరిగింది.
వీరికి ముగ్గురు కుమారులున్నారు. నాగేశ్ గొర్రెల పెంపకాన్ని జీవనాధారంగా చేసుకొని కుటుంబాన్ని పోషించేవాడు. అయితే కొంతకాలంగా భార్య ప్రవర్తనపై అతడికి అనుమానం కలగడంతో దంపతులిద్దరి మధ్య తరచుగా గొడవలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే నాగేశ్ పనికి వెళ్లకుండా ఇంటివద్దే ఉంటూ, మద్యానికి బానిస కావడంతో కుటుంబ కలహాలు మరింత తీవ్రమయ్యాయి. ఆదివారం రాత్రి మద్యం మత్తులో ఉన్న నాగేశ్కు కవితకు మరోసారి గొడవ జరిగింది. ఈ క్రమంలోనే నాగేశ్పై కవిత కత్తితో దాడికి పాల్పడింది. ఈ సమయంలో ఇంట్లోనే నిద్రిస్తున్న చిన్న కుమారుడు రాము తండ్రి ఆర్తనాదాలు విని మేల్కొన్నాడు. తండ్రిపై తల్లి దాడి చేస్తుండటాన్ని చూసి భయంతో బయటకు వచ్చి కేకలు వేశాడు.
బయట నిద్రిస్తున్న ఇతర కుటుంబసభ్యులు, స్థానికులు అక్కడికి చేరుకోగా అప్పటికే నాగేశ్ తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడి ఉన్నాడు. అతడిని చికిత్స నిమిత్తం ఆటోలో జిల్లా ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు అక్కడి నుంచి హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. తన వదినకు ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం ఉండడంతోనే గొడవలు జరుగుతున్నాయని, అదే కక్షతో తన అన్నపై కత్తితో దాడిచేసి హతమార్చిందని మృతుడి సోదరుడు రాజప్ప పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ భాస్కర్రెడ్డి తెలిపారు.


