
నేలకొండపల్లి: ప్రభుత్వం ప్రకటించిన రుణ మాఫీ తమకు అమలు కాలేదని ఒకవైపు అనేక మంది రైతులు ఆందోళనచేస్తుంటే, మరో వైపు ఎప్పుడో మృతి చెందిన రైతు పేరు రుణమాఫీ జాబితాలో వచ్చింది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం గువ్వలగూడెంకు చెందిన తుళ్లూరి వెంకయ్య 12 సంవత్సరాల కిందటే మృతి చెందారు. ఆయనకు టేకులపల్లి ఆంధ్రా బ్యాంక్లో ఖాతా ఉండగా.. ఆయన కానీ, ఆయన చనిపోయాక కుటుంబీకులు కానీ రుణం తీసుకోలేదని చెబుతున్నారు.
ఈ క్రమంలో ప్రభుత్వం విడుదల చేసిన రుణ మాఫీ జాబితాలో వెంకయ్య పేరు వచ్చింది. ఈ విషయమై వెంకయ్య కుటుంబ సభ్యులు మాట్లాడుతూ, తమ తండ్రి కానీ, తాము కానీ ఏనాడు బ్యాంక్లో రుణం తీసుకోలేదని.. ఇప్పుడు రుణమాఫీ జాబితాలో పేరు ఎలా వచ్చిందో తెలియదని వెల్లడించారు.