‘సృష్టి’ మాయ.. 90వేలకు కొనుగోలు చేసి.. 40లక్షలకు శిశువు అమ్మకం | Latest updates on Srushti Test Tube Baby Center case | Sakshi
Sakshi News home page

‘సృష్టి’ మాయ.. 90వేలకు కొనుగోలు చేసి.. 40లక్షలకు శిశువు అమ్మకం

Jul 27 2025 4:15 PM | Updated on Jul 27 2025 6:47 PM

Latest updates on Srushti Test Tube Baby Center case

సాక్షి,హైదరాబాద్‌:  తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌ కేసులో బిగ్‌ ట్విస్ట్‌ చోటు చేసుకుంది. ఐవీఎఫ్‌ పేరుతో చైల్డ్‌ ట్రాఫికింగ్‌కు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. ఆదివారం(జులై 27) మీడియా సమావేశంలో సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌ భాగోతాలను ఉత్తర మండలం డీసీపీ రష్మీ పెరుమాళ్ డీసీపీ రష్మీ పెరుమాళ్‌ బయట పెట్టారు. 

ఈ నెల 25న సృష్టి టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ సెంటర్‌పై కేసు నమోదైంది. రాజస్థాన్‌కు చెందిన బాధితురాలు సోనియా ఫిర్యాదుతో కేసు నమోదు చేశాం. గతేడాది ఆగస్టులో డాక్టర్‌ నమ్రతాను సోనియా దంపతులు కలిశారు. ఐవీఎఫ్‌ ప్రొసీజర్ కోసం డాక్టర్‌ నమ్రతను సోనియా దంపతులు కలిశారు. ఇక్కడి నుంచి దంపతులను విశాఖకు పంపారు. ఐవీఎఫ్‌ ద్వారా సాధ్యం కాదు.. సరోగసితో అవుతుందని చెప్పారు.

సరోగసి కోసం అద్దె గర్భం మోసే మహిళ దొరికిందని చెప్పారు. ఐవీఎఫ్‌ ప్రొసీజర్‌ కోసం డాక్టర్‌ నమ్రత రూ.30లక్షలు డిమాండ్‌ చేశారు. రూ.15లక్షల చెక్కు,రూ.15లక్షలు బ్యాంక్‌ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్‌. మెడికల్‌ టెస్టుల కోసం రూ.66వేలు తీసుకున్నారు. విజయవాడ వెళ్లి శాంపిల్స్‌ ఇచ్చారు. వేరే మహిళకు పుట్టిన బిడ్డను తీసుకొచ్చి సరోగసి ద్వారా పుట్టిందని నమ్మించారు.

ఢిల్లీకి చెందిన గర్భిణీని విశాఖ తీసుకొచ్చి డెలివరీ చేశారు. ఆ బిడ్డనే దంపతులకు ఇచ్చారు. ఢిల్లీలో డీఎన్‌ఏ టెస్ట్‌ చేయించారు. మరొకరి డీఎన్‌ఏ  అని తేలింది. డాక్టర‌ నమ్రత జాబితాలో చాలామంది డేటా ఉంది. బిడ్డను ఇచ్చినందుకు ఢిల్లీ మహిళకు రూ.90వేలు ఇచ్చారు. దంపతుల వద్ద మొత్తం రూ.40లక్షలు వసూలు చేశారు. 

బాధిత కుటుంబం మమ్మల్ని కలిశారు. వెంటనే మేము సోదాలు చేశాము. నమ్రత కొడుకు జయంత్ కృష్ణ అడ్వకేట్‌గా పని చేస్తూ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌పై ఏదైనా కేసులు వస్తే తనే వాదించేవారు. వైజాగ్‌లోనూ సరోగసి ద్వారా అనేక గర్భధారణలు చేశారు నమ్రత.హైద్రాబాద్‌లో ఉన్న ఒక మహిళకు రూ.89వేలు ఇచ్చి ఫ్లైట్‌లో వైజాగ్ తీసుకెళ్లి అక్కడ సర్జరీ అయ్యాక పాపని వాళ్లకు అప్పగించి మళ్ళీ హైదరాబాద్‌కు  పంపించారు. పేదలకు డబ్బు ఆశ చూపించి సరోగసీకి ఒప్పిస్తున్నారు నమ్రత. నమ్రతకు సంబంధించిన సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ లైసెన్సులు కాన్సిల్ చేశాం.ఆమె లైసెన్స్ కూడా క్యాన్సిల్‌ అయ్యింది. ఈ కేసులో ఏడుగురు నిందితులను అరెస్ట్‌ చేశాం. డాక్టర్‌ నమ్రతపై ఆంధ్రప్రదేశ్‌,తెలంగాణలలో 10కి పైగా కేసులు నమోదయ్యాయి.    

సృష్టి టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ సెంటర్‌ కథాకమామిషు ఏంటంటే?
పిల్లలు పుట్టలేదని సంతాన సాఫల్య కేంద్రానికి వెళ్లిన మహిళకు భర్త శుక్ర కణాలతో కాకుండా వేరే వ్యక్తి శుక్ర కణాలతో సంతానం కలిగించిన ఘటన సికింద్రాబాద్‌లో వెలుగులోకి వచ్చింది. ఇటీవల బాలుడి ఆరోగ్యంపై అనుమానంతో దంపతులు డీఎన్‌ఏ టెస్టు నిర్వహించగా ఈ విషయం బయటపడింది. దీంతో వారు రెజిమెంటల్‌ బజార్‌లోని సృష్టి టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ సెంటర్‌పై గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం నుంచి ఉత్తర మండలం డీసీపీ రష్మీ పెరుమాళ్, సికింద్రాబాద్‌ ఆర్డీవో సాయిరాం, డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్‌ వెంకటితో పాటు క్లూస్‌ టీం, వైద్య బృందాలు సెంటర్‌లో తనిఖీలు చేపట్టారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. నగరానికి చెందిన ఓ జంట పెళ్లై ఏళ్లు గడుస్తున్నా పిల్లలు పుట్టక పోవడంతో రెండేళ్ల క్రితం సృష్టి టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ సెంటర్‌ నిర్వహిస్తున్న డాక్టర్‌ నమ్రత­ను ఆశ్రయించారు. అక్కడ ఐవీఎఫ్‌ ప్రక్రియ అనంతరం వారికి మగబిడ్డ పుట్టాడు.

 

 

అయితే ఇటీవల బాబు అనారోగ్యానికి గురికావడంతో వైద్యులను సంప్రదించారు. వివిధ రకాల పరీక్షల తర్వాత బాబుకు క్యాన్సర్‌ ఉందని తేలడంతో ఆ దంపతులు నిర్ఘాంతపోయారు. తమ తల్లిదండ్రులతో పాటు కుటుంబీకులు ఎవరికీ క్యాన్సర్‌ చరిత్ర లేక­పోవడంతో, అనుమానం వచ్చి డాక్టర్‌ నమ్రతను గట్టిగా నిలదీశారు. ఆమె సరైన సమాధానం చెప్ప­కపోవడంతో బాబుకు డీఎన్‌ఏ టెస్టులు చేయించగా.. ఆ దంపతుల డీఎన్‌ఏతో మ్యాచ్‌ కాలేదు. దీంతో డాక్టర్‌ నమ్రత తమను మోసం చేసిందని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు. విషయం తెలిసి పరారీలో ఉన్న డాక్టర్‌ నమ్రతను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.  

విశాఖ కేసులో లైసెన్సు రద్దు చేసినా.. 
డాక్టర్‌ నమ్రత హైదరాబాద్‌తో పాటు విజయవాడ, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో సంతాన సాఫల్య కేంద్రాలను నిర్వహిస్తున్నారు. పదేళ్ల క్రితం విశాఖపట్నంలో పేద మహిళలకు డబ్బు ఆశ చూపి సరోగసికి ఒప్పించి, పిల్లలు లేని వారి నుంచి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసు అప్పట్లో సంచలనం సృష్టించింది. డాక్టర్‌ నమ్రతను పోలీసులు అరెస్టు చేయడంతో పాటు మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఆమె లైసెన్సును రద్దు చేసింది. దీంతో ప్రస్తుతం ఇక్కడ నడుస్తున్న టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ సెంటర్‌లో ఇతర డాక్టర్ల లైసెన్సుల ద్వారా వైద్యం అందిస్తున్నట్లు తెలిసింది. కాగా కేపీహెచ్‌బీలోని టెస్ట్‌ట్యూబ్‌ బేబీ సెంటర్‌లో కూడా ఇలాగే అక్రమ సరోగసీ కేసు నమోదైంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement