స్వామి రామానందతీర్థ మెమోరియల్ స్కూల్ విద్యార్థులకు స్వయంగా భోజనం వడ్డిస్తున్న కేటీఆర్
పిల్లలతో గడిపే ప్రతిక్షణం ఆనందభరితమే
స్వామిరామానందతీర్థలో జరిగిన కార్యక్రమంలో కేటీఆర్
సనత్నగర్ (హైదరాబాద్): మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విద్యార్థులకు సూచించారు. గురువారం బేగంపేట బ్రాహ్మణవాడిలోని స్వామి రామానందతీర్థ మెమోరియల్ స్కూల్ను సందర్శించి ఆయన విద్యార్థులకు నోట్బుక్స్, స్కూల్ బ్యాగ్లు పంపిణీ చేశారు. అలాగే తలసాని ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ 16 భాషల్లో ప్రావీణ్యం సంపాదించిన పీవీ నరసింహారావు దేశానికి, ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారని చెప్పారు.
ఆయన చూపిన మార్గంలో నడుస్తూ విద్యార్ధులు జీవితంలో గొప్ప స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. 2023లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రారంభించిన సీఎం బ్రేక్ఫాస్ట్ పథకాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. పిల్లలతో గడిపే ప్రతి క్షణం ఆనందాన్ని ఇస్తుందని చెప్పారు. సమాజ భవిష్యత్తును తీర్చిదిద్దే విద్యా ర్ధులకు నాణ్యమైన విద్యతో పాటు పోషకాహారం కూడా అందించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు.
స్వామి రామానందతీర్థ మెమోరియల్ స్కూల్కు అవసరమైన అదనపు తరగతి గదులు, ఆధునిక లైబ్రరీ నిర్మాణానికి పూర్తి సహకారం అందిస్తామని కేటీఆర్ హామీనిచ్చారు. విద్యార్థులకు అండగా నిలుస్తూ విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న తలసాని శ్రీనివాస్యాదవ్ను ప్రత్యేకంగా అభినందించారు. పాఠశాల అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న ఎమ్మెల్సీ వాణీదేవి సేవలను ప్రశంసించారు.
ఇది సామాజిక బాధ్యత: ఎమ్మెల్యే తలసాని
ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల విద్యార్ధులకు చేయూత అందించడం సమాజ బాధ్యత అని తల సాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. ట్రస్ట్ కార్యక లాపాలను సమర్థవంతంగా నిర్వహిస్తూ విద్యా సేవలను విస్తరింపజేస్తున్న ఎమ్మెల్సీ వాణీదేవిని ఆయన అభినందించారు. తలసాని ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థుల కోసం స్వచ్ఛందంగా మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. విద్యార్థుల సమగ్ర వికాసానికి నాణ్యమైన విద్యతో పాటు సరైన పోషకాహారం కూడా అవసరమని ఎమ్మెల్సీ వాణీదేవి పేర్కొన్నారు. పిల్లలకు సమతుల్య పోషకాహారం అందించినప్పుడే వారి మేధస్సు వికసిస్తుందన్నారు.


